
హైదరాబాద్: ఎన్నో సంచలనాలకు మారుపేరైన ఫిఫా 2018లో మరో సంచలనం. ఆశ్చర్యకర ప్రదర్శనను కొనసాగిస్తూ సంచలనాల క్రొయేషియా ఫిఫా-2018 పుట్బాల్లో మరోసారి సత్తా చాటి చరిత్ర సృష్టించింది. లుజ్నికీ స్టేడియంలో జరిగిన రసవత్తర పోరులో ఇంగ్లాండ్పై 2-1 తేడాతో గెలిచి తొలిసారిగా ఫైనల్కు చేరింది. దీంతో క్రొయేషియా తమ ఫుట్బాల్ చరిత్రను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.
ఫిఫా వరల్డ్ కప్లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
ఇక ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఫ్రాన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్లో ఇంగ్లండ్కు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. 1966 తర్వాత రెండో సారి ఫైనల్ చేరాలన్న ఇంగ్లాండ్ కలలను క్రొయేషియా భగ్నం చేసింది. రెండు జట్లు అంచనాలు లేకుండానే బరిలోకి దిగినప్పటికీ విజయం క్రొయేషియానే వరించింది.
ఆతిథ్య, పర్యాటక రంగాల్లో అద్భుత అవకాశాలు: ఇండియాలో 4 కోట్ల ఉద్యోగాలు
మ్యాచ్ ఆరంభంలో కాస్త ఆధిక్యాన్ని ప్రదర్శించినా ఇంగ్లాండ్ ఆ పట్టు నిలుపుకోలేకపోయింది. క్రమేపి క్రొయేషియా పుంజుకోవడంతో ఇంగ్లాండ్ శ్రమ వృథాకాక తప్పలేదు. మ్యాచ్ మొదలైన 5వ నిమిషంలో కైరాన్ ట్రిప్పిర్ కొట్టిన ఫ్రీకిక్ గింగిరాలు తిరుగుతూ టాప్ కార్నర్ నుంచి క్రొయేషియా గోల్పోస్ట్లోకి దూసుకెళ్లింది. మధ్యలో ఆటగాళ్లు అడ్డుగోడలా నిలబడినా.. ప్రత్యర్థి గోలీ సుబాసిచ్ అమాంతం గాల్లోకి ఎగిరినా బంతిని అడ్డుకోలేకపోయాడు.
ట్రిప్పిర్కు అంతర్జాతీయ టోర్నీల్లో ఇదే తొలి గోల్ కావడం విశేషం. 2006 తర్వాత వరల్డ్కప్లో ఫ్రీకిక్ను గోల్గా మలిచిన తొలి ప్లేయర్గా ట్రిప్పిర్ రికార్డులకెక్కాడు. ఆ తర్వాత ద్వితీయార్థంలో క్రొయేషియా ఆటగాడు ఇవాన్ పెరిసిక్ 68వ నిమిషంలో గోల్ కొట్టి జట్టు స్కొరును సమం చేశాడు. ఇక అదనపు సమయంలో మారియో మండ్జుకిక్ 109 నిమిషంలో గోల్ చేసి క్రొయేషియాను విజయ తీరాలకు చేర్చాడు. ఫిఫా వరల్డ్కప్లో మొదటిసారి ఫైనల్ చేరి క్రొయేషియా చరిత్ర తిరగరాసింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో ఫ్రాన్స్తో క్రొయేషియా తలపడనుంది.