న్యూఢిల్లీ: కొలంబియా ఫుట్బాల్ జట్టులో విషాదం నెలకొంది. ఆ జట్టు యువ ప్లేయర్ ఆండ్రెస్ బలంతా గుండె పోటుతో మృతి చెందాడు. 22 ఏళ్ల ఆండ్రెస్ అకాల మరణం ఫుట్బాల్ ప్రపంచాన్నే శోక సంధ్రంలో ముంచెత్తింది. కొలంబియా మిడ్ ఫీల్డర్ అయిన ఆండ్రెస్ బలంతా.. ప్రాక్టీస్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. దాంతో నిర్వాహకులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూనే మంగళవారం మరణించాడు. గుండె పోటుతోనే ఆండ్రెస్ బలంతా మృతి చెందాని వైద్యులు తెలిపారు.
అట్టెటికో టుకమన్ క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆండ్రెస్.. ఆ జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.ట్రెయినింగ్ సెషన్ జరుగుతుండగానే ఆండ్రెస్ బలంతా ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇక 2021-22 సీజన్లో అట్లెటికో టుకుమన్ తరఫున ఆండ్రెస్ ఏడు మ్యాచ్లు ఆడాడు. ఆండ్రెస్ మృతిపై కొలంబియా ఫుట్బాల్ జట్టు సంతాపం ప్రకటించింది.
ఇక మాంచెస్టర్ సిటీ దిగ్గజం సెర్జియో ఆగురో ఆండ్రెస్ మృతిపై విచారం వ్యక్తం చేశాడు. ''బలంతా చనిపోవడం బాధాకరం. అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్యులు ఇకపై ఆండ్రెస్ ఫుట్బాల్ ఆడేందుకు వీల్లేదని చెప్పారు. కానీ ఇంతలోనే మృతి చెందడం ఎంతో బాధ కలిగిస్తుంది. ఆ స్థానంలో నేను ఉన్నా బాగుండేది. భరించడం కష్టంగా ఉంది. మిస్ యూ ఆండ్రెస్'అని భావోద్వేగానికి గురయ్యాడు.
ఇక ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్కు కొలంబియా అర్హత సాధించడంలో విఫలమయింది. 2014లో క్వార్టర్ ఫైనల్స్, 2018 వరల్డ్కప్లో రౌండ్ ఆఫ్ 16లో వెనుదిరిగిన కొలంబియా ఈసారి మాత్రం మెగాటోర్నీకి అర్హత సాధించలేకపోయింది. దీంతో కొలంబియా జట్టులోని స్టార్ ఆటగాళ్లు లుయిస్ డియాజ్, జేమ్స్ రోడ్రిగ్వేజ్, డేవిన్సన్ సాంచెజ్లు వరల్డ్కప్ ఆడే అవకాశం కోల్పోయారు.