
బ్యాంకాక్: టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ గురువారం తన 38వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. థాయ్లాండ్లో కొంతమంది సన్నిహితులతో కలిసి యువీ తన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. సన్నిహితులతో పాటు యువీ సహచర ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్, హర్భజన్ సింగ్లు కూడా హాజరయ్యారు. యువీ చిన్ననాటి స్నేహితుడు గౌరవ్ కపూర్ సందడి చేసాడు.
థాయ్లాండ్లోని ఓ హోటల్లో టీమిండియా మాజీ ఆటగాళ్లు, సన్నిహితులు యువీతో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను యువరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గ్రూప్లుగా దిగిన ఫోటోలను యువరాజ్ తన ట్వీటర్ అకౌంట్లో అభిమానులతో పంచుకున్నాడు. 'స్పెషల్ ఫ్రెండ్స్తో స్పెషల్ డే. గుర్తుంచుకోవాల్సిన రోజు. నాకు విషెస్ చెప్పిన అందరికీ థాంక్యూ' అని రాసుకొచ్చాడు.
యువరాజ్ బర్త్డే వేడుకల ఫొటోలను హర్భజన్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'హ్యాపీ బర్త్డే బ్రదర్. కలకాలం సంతోషంగా ఉండాలి' అని రాసుకొచ్చాడు. 'సూపర్స్టార్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేవుడు నీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నా' అని సచిన్ ట్వీట్ చేసాడు. ఐసీసీ, బీసీసీఐ, క్రికెటర్లు, మాజీలు, అభిమానులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. యువీ బర్త్డే ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఈ ఏడాది జూన్లో యువరాజ్ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ భారత్ గెలవడంతో యువీ కీలక పాత్ర పోషించాడు. 1996లో అండర్-15 ప్రపంచకప్ , 2000 సంవత్సరంలో అండర్-19 ప్రపంచకప్.. 2007, 2011 ప్రపంచకప్లలో 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 6 బంతులకు 6 సిక్స్లు కొట్టి హీరో అయ్యాడు.
2000లో కెన్యాపై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువీ.. 2017లో చివరి మ్యాచ్ ఆడాడు. యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు చేసాడు. ఇక 58 టీ20 మ్యాచ్లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.