
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. గతకొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముంబైలోని వర్సోవా శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. కరోనా వైరస్ కారణంగా ఈ అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరయ్యారు.
ఇక ఇర్ఫాన్ మృతిపై యావత్ దేశం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సినీ,రాజీకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్తో తాను పోరాడిన రోజులను గుర్తు చేసుకున్నాడు. క్యాన్సర్తో పోరాడటంలో ఉండే బాధ ఏంటో తనకు తెలుసని చెబుతూ ఇర్ఫాన్ మృతికి సంతాపం ప్రకంటించాడు.
''ఆ ప్రయాణం.. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అదృష్టవంతులు కొందరు చివరి వరకూ పోరాడి గెలుస్తారు. కొందరు ఓడిపోతారు. ఇర్ఫాన్ ఖాన్.. ప్రస్తుతం నువ్వు మంచి స్థానంలో ఉన్నావని ఖచ్చితంగా చెప్పగలను. మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా'అంటూ యువరాజ్ ట్వీట్ చేశాడు.
ఇక 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో యువరాజ్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. కానీ వ్యాధి సోకిన విషయాన్ని గ్రహించిన యూవీ.. అస్వస్థతతోనే టోర్నీ ఆసాంతం ఆడి అదరగొట్టాడు. ఓ మ్యాచ్లో ఏకంగా రక్తపు వాంతులు చేసుకున్నాడు. కానీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తనదైన ఆటతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి.. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత్ను విశ్వవిజేతగా నిలిపాడు. అనంతరం విదేశాలకు వెళ్లి క్యాన్సర్కు చికిత్స చేయించుకొని మహమ్మారిని జయించాడు. అనంతరం మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి బ్యాట్తో మెరుపులు మెరిపించాడు.
ఇక ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల యువరాజ్తో పాటు క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేసింది. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ షమీ, కైఫ్, సురేశ్ రైనా తదితరులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.