
హైదరాబాద్: భారత టాపార్డర్ బలంగా ఉందని, నాలుగో స్థానంలో ఆడే బ్యాట్స్మన్ గురించి ఆందోళన వద్దని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సెటైరికల్గా ట్వీట్ చేశాడు. గత కొన్నేళ్లుగా భారత జట్టులో నాలుగో స్థానంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ స్థానంలో ఆడే సరైన బ్యాట్స్మన్ కోసం జట్టు మేనేజ్మెంట్ పలువురు బ్యాట్స్మెన్లను పరీక్షించిన సంగతి తెలిసిందే.
ఎంతోమందిని పరీక్షించినప్పటికీ ఈ స్థానంపై స్పష్టత రాలేదు. దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో భాగంగా టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ని ఈ స్థానంలో జట్టు మేనేజ్మెంట్ పరీక్షించింది. అయితే, అతడు ఈ స్థానంలో విఫలమయ్యాడు. మరోవైపు ఈ స్థానానికి మిడిలార్డర్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ అయితే బాగుంటుందని పలువురి వాదన.
ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నాలుగో స్థానానికి సరిగ్గా సరిపోయే ఆటగాడిని సూచించాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హాజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేస్తోన్న సూర్యకుమార్ యాదవ్ ఈ స్థానానికి సరిపోతాడని హర్భజన్ సింగ్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
"దేశవాళీ క్రికెట్లో పరుగుల మోత మోగిస్తున్న సూర్యకుమార్ యాదవ్ను భారత జట్టులో ఎందుకు తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదు. నువ్వు ఇలానే శ్రమించు. కచ్చితంగా కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది" అంటూ విజయ హాజారే టోర్నీలో సూర్య కుమార్ యాదవ్ 31 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేసిన ఫోటో జత చేసి భజ్జీ ట్వీట్ చేశాడు.
భజ్జీ చేసిన ట్వీట్కు యువరాజ్ సింగ్ తనదైన శైలిలో స్పందించాడు. "భజ్జీ.. నీకు ఎన్నిసార్లు చెప్పాలి. మనకు నాలుగో స్థానం అవసరం లేదు. మన టాపార్డర్ బలంగా ఉంది కదా?" అంటూ యువరాజ్ సటైరికల్గా ట్వీట్ చేశాడు. గతంలో నాలుగో స్థానానికి సంజూ శాంసన్ అయితే చక్కగా సరిపోతాడని చెప్పిన భజ్జీ ఇప్పుడు మరొకరి పేరుని చెప్పడం విశేషం.