హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు 2011 ప్రపంచకప్ సాధించిన ఇటీవలే 9 ఏళ్లు పూర్తైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాటి ప్లేయర్లంతా ఈ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ నాటి క్షణాలను ట్విటర్ వేదికగా నెమరువేసుకున్నాడు. ముఖ్యంగా ఆ మెగా ఫైనల్ అనంతరం టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ను తన భుజాలపై ఎత్తుకొని ఊరేగించడం మరిచిపోలేనిదన్నాడు.
'ప్రపంచకప్ గెలిచి 9 ఏళ్లు పూర్తయినా.. నిన్న జరిగినట్టే ఉంది. ఈ అద్భుతమైన రాత్రి మరిచిపోలేనిది. ఈ చారిత్రాత్మకమైన మూమెంట్లో భాగస్వామి అయింనందుకు గొప్పగా ఉంది'అని పఠాన్ ట్వీట్ చేశాడు. దీనిపై సచిన్ కూడా ట్వీట్ చేశాడు. ' యూసఫ్.. భారత్ తరపున ఆడడం ఎప్పుడూ గర్వించదగిన విషయమే. దేశం, అభిమానుల కోసం వరల్డ్కప్ను గెలుపొందడం తన హృదయానికి అతిచేరువగా నిలిచిన మధుర జ్ఞాపకం.'అని సచిన్ బదులిచ్చాడు.
ఈ ట్వీట్పై యూసఫ్ బదులిస్తూ.. 'సచిన్ పాజీ.. ఆ రోజు నిన్ను అలా భుజాలపైకి ఎత్తుకోవడం మరిచిపోలేనిది. ఆ క్షణం నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.' ట్వీట్ చేశాడు.
అప్పుడెప్పుడో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచకప్ గెలవగా.. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ధోనీ సారథ్యంలోని భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది.స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.. భారత విజయాల్లో కీలకపాత్ర పోషించి, మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లంతా సచిన్ను భుజాలపై ఎత్తుకొని మైదానమంతా ఊరేగించారు.