
మెల్బోర్న్: టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకు మెల్బోర్న్ హోటల్ రూంలో బుధవారం సాయంత్రం టీమిండియా గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. బెంగళూరులో ఫిట్నెస్ పరీక్షల అనంతరం రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లిన రోహిత్.. 14 రోజుల పాటు క్వారంటైన్ నిబంధనలను పాటించాడు. బుధవారం సాయంత్రం మెల్బోర్న్లోని హోటల్ రూంలో ఉన్న భరత జట్టును కలిశాడు. ఈ సందర్భంగా రహానే సేన రోహిత్కు ఘనస్వాగతం పలికింది. భారత అందరూ ఆటగాళ్లు రోహిత్కు స్వాగతం పలికారు.
జట్టు హోటల్కు చేరుకున్న రోహిత్ శర్మకు టీమిండియా సహచరులు, కోచింగ్ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఒకర్నొకరు హత్తుకుంటూ అభినందనలు తెలియజేసుకున్నారు. తొలుత టీమిండియా సహాయ సిబ్బంది రోహిత్కు స్వాగతం పలికారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అతడితో చేయి కలిపి ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా, చెతేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ తదితరులు అతడికి స్వాగతం పలికారు.
హెడ్ కోచ్ రవిశాస్త్రి అయితే క్వారంటైన్ తర్వాత నాజూగ్గా కనిపిస్తున్నావని అతడిని పలకరించడం గమనార్హం. 'మిత్రమా.. నీ క్వారంటైన్ ఎలా గడిచింది? చాలా నాజూగ్గా (యువకుడు) కనిపిస్తున్నావ్' అని ప్రత్యేకంగా అన్నాడు. రవిశాస్త్రి రోహిత్తో అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా జరగనున్న మూడో టెస్టులో రోహిత్ ఆడే అవకాశాలున్నాయి.
మరోవైపు తాము ఐదు బౌలర్ల వ్యూహానికి కట్టుబడి ఉన్నామని, క్వారంటైన్ తర్వాత రోహిత్ శర్మ మానసిక స్థితి, మ్యాచ్ ఫిట్నెస్ ఎలా ఉన్నాయో చూసిన తర్వాతే ఆడించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని రవిశాస్త్రి వెల్లడించాడు. అయితే మూడో టెస్టుకు తగినంత సమయం ఉండటంతో పాటు, మయాంక్ అగర్వాల్ వరుస వైఫల్యాలతో అతని స్థానంలో రోహిత్ మ్యాచ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.