ఢిల్లీ: యో-యో టెస్టును టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అస్సలు మర్చిపోవడం లేదు. యో-యో టెస్టు పేరుతో టీమిండియా యాజమాన్యం అతన్ని పక్కనపెట్టిన విషయం తెలిసిందే. దీంతో పదే పదే అదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ యువీ పలు సందర్భాల్లో మండిపడ్డాడు. తాజాగా మరోసారి గుర్తు చేసుకుని.. తాను బ్యాట్తో మెరిసినప్పటికీ యో-యో టెస్టు పేరుతో జట్టు నుంచి వైదొలిగేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈసారి కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలను పరోక్షంగా టార్గెట్ చేసాడు.
తొలి టీ20 ఓటమిపై రోహిత్ అసహనం.. ఫీల్డింగ్ తప్పిదాలే కొంపముంచాయి!!
తాజాగా యువరాజ్ మాట్లాడుతూ... 'నేను బ్యాట్తో మెరిసినప్పటికీ యో-యో టెస్టు పేరుతో జట్టు నుంచి వైదొలిగేలా చేశారు. ఒక ఆటగాడు బాగా ఆడుతుంటే యో-యో టెస్టుతో పనేంటని' ప్రశ్నించాడు. 'జట్టులో చోటు కోల్పోవడానికి యో-యో టెస్టే కారణం. దాంట్లో ఇక పాస్ కాలేననే క్రికెట్కు వీడ్కోలు చెప్పా. ఆ సమయంలో బీసీసీఐ చీఫ్గా సౌరవ్ గంగూలీ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. నేను కెరీర్ను అర్థాంతరంగా ముగించాల్సిన పరిస్థితి వచ్చేది కాదు' అని యువరాజ్ పేర్కొన్నాడు.
టీమిండియాకు ఎంపికలో యో-యో టెస్ట్ను ప్రామాణికం చేయడం విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిల హయాంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. కేన్సర్ బారినుంచి బయటపడ్డాక క్రికెట్లో పునరాగమనం చేసిన యువరాజ్ను యో-యో టెస్ట్ పాస్ కాలేదంటూ పలుమార్లు జట్టుకు దూరం పెట్టారు. 2017లో వెస్టిండీస్ టూర్ నుంచి వచ్చాక ఇదే కారణంతో యువీని జట్టుకు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో సమయమొచ్చినప్పుడల్లా యో-యో టెస్ట్పై అతడు అంసతృప్తి ప్రకటిస్తూనే ఉన్నాడు.
కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన యువరాజ్ సింగ్.. ఇప్పుడు విదేశీ లీగ్లు ఆడుకుంటున్నాడు. నవంబర్ 14 నుండి మూడో సీజన్ ప్రారంభమవనున్న టీ10 లీగ్లో యువరాజ్ సింగ్ మరఠా అరేబియన్స్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరాఠా తరఫున శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగా, వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవోలు కూడా ఆడుతున్నారు. బ్రేవో మరాఠా జట్టుకు కెప్టెన్. టీ10 లీగ్ గత ఏడాది షార్జా క్రికెట్ స్టేడియంలో లీగ్ జరగగా.. ఈ సారి యుఏఈ రాజధాని అబుదాబిలో జరుగనుంది. ఈ లీగ్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి.