ప్లేయర్ ఆఫ్ ది సిరీస్:
అండర్-19 ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో గత ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత్ తుది మెట్టుపై బోర్లాపడింది. ట్రోఫీ చేజారినా భారత ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అందరిని ఆకట్టుకున్నాడు. టోర్నీలో ఆరు మ్యాచ్లాడిన జైశ్వాల్ ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీ (88, 105, 62, 57, 29, 59)లతో మొత్తం 400 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. టోర్నీలో టాప్ స్కోరర్గా జైశ్వాల్ నిలవగా.. అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు లభించింది.
ప్రపంచకప్ అవార్డును ముక్కలు:
టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసినా.. బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో యశస్వి జైశ్వాల్ చాలా నిరాశకి గురయ్యాడు. ఈ క్రమంలోనే తనకి లభించిన ట్రోఫీని అతను పగలగొట్టినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చాక చూస్తే అతడి ట్రోఫీ రెండు ముక్కలై కనిపించిందట. అయితే ట్రోఫీకి ఏం జరిగిందో మాత్రం అతడికి గుర్తులేదట.
ట్రోఫీల గురించి పట్టించుకోడు:
ట్రోఫీని విరగొట్టడంపై యశస్వి జైశ్వాల్ కోచ్ జ్వాలా సింగ్ స్పందించాడు. 'ఇదేం మొదటిసారి కాదు. జైశ్వాల్ పరుగులపై శ్రద్ధ పెడతాడు తప్ప.. ట్రోఫీల గురించి అతిగా పట్టించుకోడు' అని అన్నాడు. ఎడమచేతి వాటం కావడంతో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో భారత సీనియర్ జట్టులోకి జైశ్వాల్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరి జైశ్వాల్ అదృష్టం ఎలా ఉందో చూడాలి.
ఇక్కడితోనే ప్రపంచం ముగిసిపోదుగా:
'ఫైనల్లో చెత్త షాట్ ఆడాను. ఆ సమయంలో అది అనవసరం. నేను ఊహించిన దానికన్నా బంతి చాలా వేగంగా వచ్చింది. అంతకు ముందే నెమ్మదిగా వస్తున్న బంతిని ఎదుర్కొన్నా. తర్వాతి బంతి కూడా అలానే వస్తుందనుకుని పొరపాటు చేశా. ప్రపంచకప్ గెలిస్తే బాగుండేది. అయితే ఇక్కడితోనే ప్రపంచం ముగిసిపోదుగా' అని మ్యాచ్ అనంతరం జైశ్వాల్ చెప్పుకొచ్చాడు.