
హైదరాబాద్: క్రికెట్ చరిత్రలో ఇలాంటి దృశ్యాన్ని మీరు ఎప్పుడూ చూసిండరు. ఇప్పటి వరకు మైదానంలో ఉన్న ఆటగాళ్లతో కామెంటేటర్లు మాట్లాడటమే చూశాం. కానీ, మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫీల్డర్ల పక్కన నిలబడి ఓ కామెంటేటర్ కామెంటరీ ఇవ్వడం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.
వివరాల్లోకి వెళితే... గురువారం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా వెస్టిండీస్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ టి20 మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే నిధులను వెస్టిండీస్లోని క్రికెట్ మైదానాల పునరుద్ధరణ పనులకు ఉపయోగించనున్నారు.
గతేడాది ఇర్మా తుఫాను వల్ల కరేబియన్ దీవుల్లోని ఐదు క్రికెట్ మైదానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు అవసరమైన నిధులను సేకరించేందుకు ఈ మ్యాచ్ని ఐసీసీ అధికారికంగా నిర్వహించింది. ఈ మ్యాచ్లో వెస్టిండిస్ ఆటగాడు క్రిస్ గేల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వికెట్ కీపర్, తొలి స్లిప్ ఫీల్డర్ మధ్య కాస్త వెనక్కు జరిగి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ కామెంటరీ ఇచ్చాడు.
ఎగ్జిబిషన్ మ్యాచ్ కావడంతో ఫర్వాలేదు గానీ, ఐసీసీ అధికారికంగా అంతర్జాతీయ టి20 హోదా ఇచ్చిన మ్యాచ్లో ఇలాంటి ఘటన జరగడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో విండిస్ ఓపెనర్ ఎవిన్ లెవిస్(58) బ్యాట్తో రాణించగా.. స్పిన్నర్ శామ్యూల్ బద్రీ(2/4) బౌలింగ్తో చెలరేగడంతో వరల్డ్ ఎలెవన్ జట్టుపై 72 పరుగుల తేడాతో వెస్టిండిస్ విజయం సాధించింది. వరల్డ్ ఎలెవన్ జట్టులో తిసార పెరీరా(61) మాత్రమే రాణించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 8 పరుగులకే టాప్ ఆర్డర్లోని నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్(0), సామ్ బిల్లింగ్స్(4), రషీద్ ఖాన్(9) తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరడంతో 16.4 ఓవర్లలో ఎలెవన్ 127 పరుగులకే కుప్పకూలింది.