|
లార్డ్స్లో అద్భుత ఫైనల్ మ్యాచ్
"లార్డ్స్లో అద్భుత ఫైనల్ మ్యాచ్ జరిగి వారం రోజులు పూర్తయిందంటే నమ్మలేకపోతున్నా. నా క్రికెట్ కెరీర్లోనే ఉత్తమమైన, చెత్త రోజు అది. విభిన్నమైన భావోద్వేగాలకు గురయ్యా. అయితే న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం... బ్లాక్ క్యాప్స్ లాంటి గొప్ప ఆటగాళ్లతో ఆడటాన్ని చాలా గర్వంగా ఫీలవుతున్నా. మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు" అని గుప్టిల్ పోస్టు పెట్టాడు.
ఈ ప్రపంచకప్లో నిరాశ పరిచిన గుప్టిల్
2015 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేసిన మార్టిన్ గుప్టిల్ ఈ ప్రపంచకప్లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే, టీమిండియాతో జరిగిన సెమీస్ మ్యాచ్లో అత్యంత కీలక సమయంలో ధోనీని రనౌట్ చేసి కివీస్ ఫైనల్కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. లార్డ్స్ వేదికగా జులై 14న న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో బౌండరీ రూల్ ఆధారంగా ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.
మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు
ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మార్టిన్ గప్టిల్ విసిరిన త్రో అనూహ్యంగా బెన్స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ తీసిన రెండు పరుగులతోపాటు ఓవర్ త్రో వల్ల అదనంగా మరో నాలుగు పరుగులు ఆ జట్టుకు కలిసివచ్చాయి.
ఓవర్ త్రో కారణంగా
ఈ ఓవర్ త్రో కారణంగా మ్యాచ్ ఫలితమే తారుమారైంది. ఈ పరుగుల కారణంగా తొలుత ఇరు జట్లు ప్రధాన స్కోరు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితం నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ను నిర్వహించారు. సూపర్ ఓవర్లోనూ ఇరు జట్ల స్కోరు సమం అయిన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఆతిథ్య జట్టైన ఇంగ్లాండ్ను ఐసీసీ విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే.