రాణించిన ఖాతూన్
భారత మహిళలు నిర్దేశించిన 143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మహిళల ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. 5 పరుగులకే తొలి వికెట్ను కోల్పోయింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ షామిమా సుల్తానా (3; 8 బంతుల్లో)ను శిఖ పాండే ఔట్ చేసింది. ఫస్ట్ డౌన్లో క్రీజులోకి వచ్చిన సంజిద ఇస్లాం (10)తో కలిసి మరో ఓపెనర్ ముర్షిదా ఖాతూన్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ నిర్మించింది. 26 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేసింది.
పూనమ్ మరోసారి తిప్పేసింది
8వ ఓవర్లో తెలుగమ్మాయి అరుంధతీ రెడ్డి కీలక ఖాటూన్ (30; 26 బంతుల్లో 4×4)ను పెవిలియన్కు పంపించింది. ఇక కెప్టెన్ హర్మన్ప్రీత్ బంతిని కీలక స్పిన్నర్ పూనమ్ యాదవ్ చేతికి ఇచ్చింది. దీంతో బంగ్లా ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. 11వ ఓవర్లో సంజిదా షాట్కు యత్నించి వికెట్కీపర్ తానియా చేతికి చిక్కింది. అయితే తొలుత అంపైర్ ఔట్ ఇవ్వలేదు. భారత్ సమీక్షకు వెళ్లి వికెట్ దక్కించుకుంది.
భారత బౌలర్ల ఒత్తిడి
అనంతరం అద్భుతమైన బంతితో ఫర్గానాను అరుంధతీ పెవిలియన్కు చేర్చింది. దీంతో బంగ్లా కీలక నాలుగు వికెట్లు కోల్పుయి కష్టాల్లో పడింది. 16వ ఓవర్లో పూనమ్ బౌలింగ్లో ఫాహిమా (17) షాట్కు యత్నించి షెఫాలీ చేతికి చిక్కింది. ఆపై రాజేశ్వరి కీలక వికెట్ పడగొట్టింది. తన బౌలింగ్లో నిగర్ (35) ను ఔట్ చేసింది. అప్పటి వరకు బలంగా కనిపించిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఆ తర్వాత క్రమంగా సడలిపోయింది. భారత బౌలర్లు ఒత్తిడి పెంచడంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
భారత్కు రెండో విజయం
ఇక బంగ్లా 6 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి వచ్చింది. పాండే మూడు పరుగులే ఇవ్వడంతో పాటు రుమాన అహ్మద్ (13)ను పెవిలియన్ చేర్చింది. దీంతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. అరుంధతి (2/35), పూనమ్ (3/18) రాణించారు. ఇక ప్రపంచకప్లో భారత్కు రెండో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మెరుగయ్యాయి.
షెఫాలీ మెరుపులు
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (34, 37 బంతుల్లో; 2×4, 1×6) ఆకట్టుకుంది. బంగ్లా బౌలర్లలో సల్మా ఖాతున్, పన్నా ఘోశ్ చెరో రెండు వికెట్లు తీశారు.