హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అడ్డుకోవాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బీసీసీఐ పాలక మండలి (సీవోఏ) హెచ్చరికలు జారీ చేసింది. అలాంటి సంఘాలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని శుక్రవారం జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయించింది.
ఐపీఎల్ మ్యాచ్లకు బీసీసీఐ నిధులు విడుదల చేయడం లేదని, ఇలాగైతే ఐపీఎల్ నిర్వహణ కష్టమని కొన్ని రాష్ట్ర సంఘాలు చెబుతున్న నేపథ్యంలో బీసీసీఐ పాలక మండలి శుక్రవారం సమావేశమైంది. రాష్ట్ర సంఘాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కమిటీ అభిప్రాయపడింది.
ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని ఫ్రాంచైజీ, బోర్డు చెరి సమానంగా భరిస్తాయని, ఇందులో రాష్ట్ర సంఘాలు పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని బోర్డు అధికారి ఒకరు అన్నారు. లీగ్ దశలో జరిగే ఏడు మ్యాచ్లు నిర్వహించడానికి రూ. 60 లక్షలు ఖర్చవుతాయిని ఆయన తెలిపారు.
అందులో ఫ్రాంఛైజీ రూ.30 లక్షలు భరిస్తుందని, మిగతా మొత్తాన్ని మ్యాచ్లు విజయవంతంగా నిర్వహించిన తర్వాత ఆయా రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ చెల్లిస్తుందని చెప్పారు. ఇందులో రాష్ట్ర సంఘాలకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఇన్నాళ్లూ ఇదే జరుగుతోందని అన్నారు.
కానీ ఇప్పుడు కొత్తగా కొన్ని సంఘాలు తమ నిధుల నుంచి ఖర్చు చేస్తామ నిఅబద్దాలు చెబుతున్నాయని ఆరోపించారు. ఐసీసీ అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను కూడా ఈ సమావేశంలో కమిటీ సభ్యులు చర్చించారు. ఏప్రిల్లో జరిగే ఐసీసీ సమావేశానికి విక్రమ్ లిమాయేను పంపాలని నిర్ణయించారు.