సమ్మెకు నాయకత్వం షకీబ్
బంగ్లా క్రికెటర్లు సమ్మెకు నాయకత్వం వహించిన టెస్టు, టీ20 జట్టు కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్ మాత్రం ఈ సమావేశం అనంతరం "చర్చలు విజయవంతమయ్యాయి" అని తెలిపాడు. ఈ సందర్భంగా షకీబ్ ఉల్ హాసన్ మాట్లాడుతూ "బోర్డు అధ్యక్షుడు, డైరెక్టర్లతో సమావేశమయ్యాం. మా డిమాండ్ల గురించి వివరించాం. వారు సానుకూలంగా స్పందించారు" అని షకిబ్ తెలిపాడు.
డిమాండ్లను నెరవేరుస్తామని హామీ
"త్వరలోనే మా డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. శనివారం నుంచి ఫస్ట్క్లాస్ క్రికెట్ ప్లేయర్లు ఆడుతారు. బంగ్లా జట్టు భారత్ పర్యటనకు వెళ్లనుంది. శుక్రవారం నుండి శిక్షణా శిబిరానికి వెళతాం" అని షకీబ్ అన్నాడు. సోమవారం తమ 11 డిమాండ్లను నెరవేర్చాలంటూ బంగ్లా క్రికెటర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.
11 ప్రధాన డిమాండ్లతో
దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి క్రికెటర్లకు గురువారం స్పష్టమైన హామీ లభించడంతో సమ్మెను విరమించారు. 11 ప్రధాన డిమాండ్లతో సమ్మెకు దిగగా అందులో తొమ్మిది డిమాండ్లను తీర్చడానికి బీసీబీ ముందుకొచ్చింది. ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఫీజు 35 వేల నుంచి లక్ష టకాలకు పెంచడం, ఫస్ట్క్లాస్ క్రికెటర్ల జీతాలను 50 శాతానికి పెంచడం ముఖ్యమైనవి.
నవంబర్ 3 నుంచి భారత పర్యటన
క్రికెటర్ల డిమాండ్లకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీకరించడంతో షకీబ్ ఉల్ హాసన్ నేతృత్వంలోని క్రికెటర్లు సమ్మె విరమించారు. దీంతో భారత్ పర్యటనకు మార్గం సుగమం అయింది. భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 3న జరిగే తొలి టీ20తో భారత్లో బంగ్లాపర్యటన షురూ కానుంది.