ఐపీఎల్ వేదికల జాబితా
లీగ్ దశ మ్యాచ్లను చెన్నై, బెంగళూరు, కోల్కతా, ముంబై, ఢిల్లీలో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ.. ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్లను మాత్రం అహ్మదాబాద్లోని మోతేరాలో జరపాలని ప్లాన్ చేస్తోంది. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముంబైలో ఐపీఎల్ వద్దని బీసీసీఐ, ఐపీఎల్ అధికారులు చర్చించినట్లు సమాచారం. అయితే సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్ ఫ్రాంఛైజీల సొంత మైదానాలు అయిన హైదరాబాద్, జైపూర్, మొహాలిలో బీసీసీఐ మ్యాచులు నిర్వహించట్లేదు. అందుకే ఈ మూడు ఫ్రాంఛైజీలు బీసీసీఐకి లేఖ రాశాయి. ఈ సందర్భంగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా మీడియాతో మాట్లాడారు.
ఏ ప్రాతిపదికన ఎంపిక జరిగిందో
'కరోనా ప్రభావం ఇంకా ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు స్టేడియానికి అభిమానులు అనుమతించకపోవడం మంచిది. టోర్నీ సాగుతున్నా కొద్దీ ఈ నిబంధనను సడలించొచ్చు. మొహాలీని ఈసారి ఐపీఎల్ ఆతిథ్య జాబితాలో చేర్చకపోవడం నిరాశ కలిగిస్తోంది. మొహాలీ, చండీగఢ్లో కరోనా కేసులు లేవు. ఈ నిర్ణయం వల్ల సొంతగడ్డపై ఆడడం వల్ల కలిగే ప్రయోజనాన్ని కొన్ని జట్లు పొందలేకపోతున్నాయి. ఏ ప్రాతిపదికన ఈ ఎంపిక జరిగిందో తెలుసుకోవాలనుంది. ఇదే విషయంపై బీసీసీఐకి లేఖ కూడా రాశాం. పంజాబ్లో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయనే నమ్మకంతో ఉన్నాం' అని వాడియా అన్నారు.
పంజాబ్ సీఎం విజ్ఞప్తి
వేదికల జాబితాలో మొహాలీని కూడా చేర్చాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ బీసీసీఐకి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. 'రాబోయే ఐపీఎల్ సీజన్లో మొహాలిలో మ్యాచ్లు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ నిర్ణయంపై బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి మరోసారి పునరాలోచించాలి. ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించేందుకు మేం ఎందుకు అర్హులు కామో కారణం తెలియట్లేదు. అవకాశం ఇస్తే అన్ని జాగ్రత్తలతో మ్యాచ్లను నిర్వహిస్తాం' అని పేర్కొన్నారు.
కేటీఆర్, అజారుద్దీన్ కూడా
తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్, హెచ్సీఏ తరఫున అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ కూడా ఐపీఎల్ 2021 లీగ్ మ్యాచులను హైదరాబాద్లో నిర్వహించడానికి బీసీసీఐపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వేదికల జాబితా నుంచి ముంబైని తొలగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముంబై స్థానంలో హైదరాబాద్ రేసులో ఉన్నట్లు సమాచారం. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అహ్మదాబాద్లో భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ అనంతరం బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
India vs England: భారత జట్టుకి జస్ప్రీత్ బుమ్రా దూరం.. అసలు కారణం ఇదేనా?