14 పరుగుల తేడాతో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
భారత్ 14 పరుగుల తేడాతో రెండు వికెట్లు కోల్పోయింది. ఏడో ఓవర్లో బౌలింగ్కు దిగిన హోల్డర్ మంచి బౌన్స్ రాబట్టాడు. తొలి ఏడు ఓవర్లలో దాదాపు ఐదు పరుగుల రన్రేట్ను సాధించింది. దీంతో హోల్డర్ తన తొలి ఓవర్లోనే రాహుల్ను ఔట్ చేసి విండీస్కు బ్రేక్ అందించాడు. మొదటి స్లిప్లో కార్న్వాల్ చక్కటి క్యాచ్ అందుకోవడంతో కేఎల్ రాహుల్(13) పెవిలియన్కు చేరాడు.
తొలి వికెట్కు 32 పరుగుల భాగస్వామ్యం
దీంతో తొలి వికెట్కు 32 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కార్న్వాల్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అటు పుజారా ఈసారీ క్రీజులో ఇబ్బందిపడ్డాడు. తొలి పరుగు తీసేందుకు 15 బంతులు ఆడాడు. చివరికి కార్న్వాల్ బౌలింగ్లో పాయింట్ వైపు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి మయాం చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు.
డీఆర్ఎస్లో బ్రతికిపోయిన కోహ్లీ
21వ ఓవర్లో అతడి ఎల్బీ కోసం విండీస్ డీఆర్ఎస్కు వెళ్లింది. అయితే, అందులో కోహ్లీ నాటౌట్గా తేలింది. విండిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో లంచ్ విరామ సమయానికి విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 5 పరుగులే చేశాడు. వీరిద్దరు మూడో వికెట్కు 69 పరుగులు జోడించారు. హోల్డర్ వేసిన మరో అద్భుతమైన బంతిని మయాంక్ స్లిప్లో ఉన్న కార్న్వాల్కు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్కు చేరాడు.
రహానే విఫలం
తొలి మ్యాచ్లో సెంచరీతో రాణించిన వైస్ కెప్టెన్ రహానే(24) ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. కీమర్ రోచ్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం హాఫ్ సెంచరీ ఊపుమీదున్న కోహ్లీని ఓ చక్కటి బంతితో జాసన్ హోల్డర్ పెవిలియన్కు పంపించాడు. దీంతో 202 పరుగులకే టీమిండియా ఐదు వికెట్లను చేజార్చుకుంది. అనంతరం క్రీజులోకి వచ్చిన హనుమ విహారి నిలకడగా ఆడుతూ రిషబ్ పంత్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దుతున్నాడు.
విహారి, పంత్ రాణిస్తే
దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. క్రీజులో హనుమ విహారి(42), రిషబ్ పంత్(27) పరుగులతో ఉన్నారు. రెండో రోజైన శనివారం వీరిద్దరూ ఆడితే తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంది.