ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో జరిగిన సెలక్షన్ కమిటీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలలో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. యువ ఆటగాడు కేఎస్ భరత్ పేరు కూడా సెలక్షన్ కమిటీలో చర్చకు వచ్చిందట. అయితే జట్టు ఎంపిక తీరు సరిగా లేదంటూ భారత అభిమానులు మండిపడుతున్నారు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చినా.. ముఖ్యంగా ప్రపంచకప్లో పూర్తిగా విఫలమయిన కేదార్ జాదవ్కు వన్డే జట్టులో అవకాశం ఇవ్వడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో ఇంకా జాదవ్ ఎందుకు అంటూ బీసీసీఐ సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విండీస్-ఏ పర్యటనలో ఆకట్టుకున్న శుబ్మన్ గిల్ (218)కు జట్టులో అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు.
'కేదార్ 2023 ప్రపంచకప్ వరకు ఆడగలడా?. అతన్ని ఎలా ఎంపిక చేశారు' అని ఓ అభిమాని ప్రశ్నించగా.. 'కేదార్ జాదవ్కు అవకాశం ఇవ్వడం సెలెక్టర్ల లోపంగా బావిస్తున్నా' అని మరో అభిమాని అన్నాడు. 'జాదవ్కు జట్టులో పదే పదే చోటివ్వడం అనవసరం' అని అంటున్నారు. 'అద్భుతంగా రాణిస్తున్న శుబ్మన్ గిల్కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు' అని అభిమానులు ప్రశ్నించారు. 'కొత్త వారికి అవకాశం ఇవ్వండి', 'సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చి యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలి', 'గిల్ ఏం తప్పు చేశాడని బీసీసీఐ పక్కన పెట్టింది' అని అడుగుతున్నారు.
వెస్టిండీస్-ఏ జట్టుతో జరిగిన ఐదు వన్డేల అనధికారిక సిరీస్లో భారత్ -ఏ అదరగొట్టింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ఐదో వన్డేలో శుబ్మన్ గిల్ 69 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో శుబ్మన్ గిల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. గిల్ 218 పరుగులు సాధించాడు.