ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
టోర్నీలో భాగంగా శనివారం బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగు వికెట్ల తేడాతో హైదరాబాద్పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై సన్రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ స్పందించాడు.
సన్రైజర్స్ ఓటమిపై స్పందించిన విలియమ్సన్
"ఈ సీజన్లో ప్రతి మ్యాచ్లోనూ ప్రత్యర్థి ముందు చెప్పుకోదగ్గ లక్ష్యం నిర్దేశించాం. ఈ మ్యాచ్లో మరో 15 పరుగులు చేసి ఉంటే బాగుండేది. ఆర్సీబీ బ్యాట్స్మెన్ కూడా బాగా ఆడారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. గత రెండు మ్యాచుల్లోనూ చివరి వరకూ పోరాడి ఓడాం. టీ20 క్రికెట్ అంటే ఇలాగే ఉంటుంది" అని కేన్ విలియమ్సన్ అన్నాడు.
175 పరుగులు చేసిన సన్ రైజర్స్
"టీ20ల్లో క్షణాల్లోనే ఫలితాలు అటు ఇటు అవుతూ ఉంటాయి. ఈ మ్యాచ్ ఓటమితో తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే" అని విలియమ్సన్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. విలియమ్సన్ 43 బంతుల్లో 70 నాటౌట్( 5 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించాడు.
కోల్కతా గెలిస్తే టోర్నీ నుంచి సన్రైజర్స్ ఔట్
అనంతరం 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి గెలిచింది. టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై, కోల్కతా జట్లు తలపడుతున్నాయి. ముంబైతో జరిగే మ్యాచ్లో కోల్కతా ఓడితేనే హైదరాబాద్ మెరుగైన రన్రేట్తో ప్లేఆఫ్ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. ముంబైపై కోల్కతా గెలిస్తే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.