గుజరాత్: దేశ ప్రజలంతా ఒకటే అని, అందరూ కలిసి కట్టుగా ఉంటేనే కరోనా మహమ్మారిపై విజయం సాధిస్తామని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. దయచేసి అందరూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండండని కోరాడు. ప్రతిఒక్కరు మాస్కులు ధరిస్తూ తరచూ చేతులు శానిటైజ్ చేసుకోండని సూచించాడు. ప్రస్తుతం భారత దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా భయపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుంటే.. వేళల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. మహమ్మరి వ్యాప్తి అదుపులోకి మాత్రం రావడం లేదు.
IPL 2021 పూర్తిచేయకుంటే రూ. 2500 కోట్లు నష్టపోతాం: గంగూలీ
రవీంద్ర జడేజా శుక్రవారం ఓ వీడియోలో మాట్లాడుతూ ప్రజలను సురక్షితంగా ఉండమని చెబుతూనే తోటి వారికి సహాయం చేయాలని కోరాడు. 'దేశ ప్రజలందరూ దయచేసి ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండండి. దాంతో మీరూ, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఇలాంటి విపత్కర సమయంలో అందరూ కలిసికట్టుగా ఉండి కరోనాతో పోరాడాలి. కాబట్టి దయచేసి మాస్కులు ధరిస్తూ తరచూ చేతులు శానిటైజ్ చేసుకోండి. ఏదైనా అవసరమైతే మీ చుట్టు పక్కలున్న వారికి కూడా సహాయం చేయండి' అని జడేజా కోరాడు.
'కొన్నిసార్లు ఏదైనా సహాయం అడగాలంటే కొంతమంది మొహామాటం పడతారు. మీరే చొరవ తీసుకొని ఏదైనా కావాలా అని అడిగి తెలుసుకోండి. మనమంతా కలిసికట్టుగా ఉంటేనే.. ఈ మహమ్మారిపై విజయం సాధిస్తాం. స్టే హోమ్.. స్టే సేఫ్. యూస్ శానిటైజ్ రెగ్యులర్' అంటూ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. కాగా ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేయడంతో వేల మంది నుంచి మంచి స్పందన వచ్చింది. మంగళవారం ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడటంతో బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి సంయుక్త నిర్ణయం తీసుకున్నాయి. టోర్నీని వాయిదా వేయడంతో ఆటగాళ్లంతా స్వస్థలాలకు వెళ్లిపోయారు.
We are one and we shall overcome as one!
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) May 7, 2021
Kindly #StayHomeStaySafe .#MaskPodu #Yellove 🦁💛 @imjadeja pic.twitter.com/EHi1CYifbX
వాంఖడే మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో రవీంద్ర జడేజా విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో జడేజా 5 సిక్సర్లు, ఒక ఫోర్, రెండు పరుగులు సాధించి మొత్తం (ఒక నోబాల్) 37 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన రికార్డును జడేజా అందుకున్నాడు. 2011లో క్రిస్ గేల్ నమోదు చేసిన రికార్డును జడ్డూ సమం చేశాడు. గేల్ ధాటికి పరమేశ్వరన్ 37 పరుగులు సమర్పించుకున్నాడు.