సిడ్నీ: ఐసీసీ వరల్డ్ కప్లో పూల్ ఎ లో భాగంగా ఆస్టేలియా-శ్రీలంక మధ్య సిడ్నీలో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర అరుదైన రికార్డుని సాధించాడు. వరల్డ్ కప్లో హ్యాట్రిక్ సెంచరీని సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఈ టోర్నమంట్లో ఇప్పటికే రెండు సెంచరీలతో రాణించగా, ఈరోజు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో మరోసారి సెంచరీని సాధించాడు. 100 బంతుల్లో 100 పరుగులు చేసిన సంగక్కరకు వన్డేల్లో ఇది 24వ సెంచరీ కాగా, ఈ ప్రపంచకప్లో వరుసగా మూడవ సెంచరీ.
అంతక ముందు మెల్ బోర్న్లో బంగ్లాదేశ్పై జరిగిన మ్యాచ్లో (105*) పరుగులు చేయగా, వెల్లింగ్టన్లో ఇంగ్లాండ్పై జరిగిన మ్యాచ్లో (117*) పరుగులతో వరుస సెంచరీలను సాధించాడు. ఈ రెండు మ్యాచ్ల్లో శ్రీలంక విజయం సాధించింది.
377 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 201 పరుగుల వద్ద సంగక్కర రూపంలో నాల్గవ వికెట్ కోల్పోయింది. 107 బంతుల్లో 104 పరుగులు చేసిన కుమార సంగక్కరను ఆస్టేలియన్ బౌలర్ ఫల్కనర్ పెవిలియన్కు పంపాడు.
సంగక్కరకు ఇదే చివరి వరల్డ్ కప్. ఇప్పటి వరకు వరల్డ్ కప్లో భారత్కు చెందిన సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 6 సెంచరీలు సాధించగా, రికీ పాంటింగ్ 5, సెంచరీలతో రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక వన్డే ఫార్మెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కుమార సంగక్కర రెండో స్ధానంలో ఉన్నాడు.
శ్రీలంక జట్టు తరుపున 400వ వన్డే మ్యాచ్లాడిన ఆటగాళ్లలో కుమార సంగక్కర ఒకడు. వన్డేల్లో 14,000 మైలు రాయిని అధిగమించాడు. ఇక వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (18,426) పేరిట ఉంది.
శ్రీలంకపై ఆస్టేలియా ఘన విజయం
ఐసీసీ వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు సిడ్నీలో శ్రీలంక-ఆస్టేలియా మధ్య జరిగిన మ్యాచ్లో ఆస్టేలియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్టేలియా నిర్దేశించిన 377 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకునే క్రమంలో శ్రీలంక 46.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు మాత్రమే చేసింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్టేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టనికి 376 పరుగులు చేసింది. ఆస్టేలియా జట్టులో మ్యాక్స్ వెల్ సెంచరీతో అలరించగా, వాట్సన్, స్మిత్, క్లార్క్ అర్ధ సెంచరీలు సాధించారు. శ్రీలంక బౌలర్లలో మలింగ, పెరీరా చెరో 2 వికెట్లు తీసుకున్నారు.
దీంతో ఆసీస్ మూడు విజయాలను కైవసం చేసుకుని 7 పాయింట్లతో గ్రూపు ఎలో రెండో స్ధానంలో నిలిచి, క్వార్టర్స్లోకి అడుగుపెట్టింది. అంతకముందు బంగ్లాదేశ్, ఆస్టేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. గ్రూప్ ఎలో 10 పాయింట్లతో న్యూజిలాండ్ ఇంతకముందే క్వార్టర్స్లోకి వెళ్లింది.