2-1తో సిరిస్ కైవసం: సిడ్నీలో టీమిండియా విక్టరీ డ్యాన్స్ చూశారా? (వీడియో)


హైదరాబాద్: ఆసీస్ గడ్డపై చారిత్రత్మక టెస్టు సిరిస్ను కైవసం చేసుకున్న నేపథ్యంలో భారత జట్టులోని ఆటగాళ్లు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ను డ్యాన్స్తో హోరెత్తించారు. వర్షం కారణంగా సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఫలితంగా ఆసీస్ గడ్డపై కోహ్లీ సేన సరికొత్త చరిత్రను సృష్టించింది. ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ విజయంతో ఈ ఘనత సాధించిన తొలి భారత, ఆసియా కెప్టెన్గానూ విరాట్ కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు. 72 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆస్టేలియాలో టెస్టు సిరీస్ గెలవడంతో భారత్ క్రికెటర్లు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
టీమిండియా మద్దతు తెలుపుతూ
ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్ల విజయం అనంతరం టీమిండియాకు మద్దతు తెలుపుతూ ‘భారత్ ఆర్మీ' అభిమానులు వినసొంపైన సంగీతంతో మైదానంలోని ఆటగాళ్లలో ఉత్సాహం నింపారు. ఈ సిరిస్లో తనను డ్యాన్స్తో గేలి చేసిన ఆస్ట్రేలియా అభిమానులకి అదేరీతిలో బదులిస్తూ రిషబ్ పంత్ తొలుత డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత వరుసగా కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానే అతడిని అనుసరించారు.
పుజారా చేయి పట్టుకుని పంత్ డ్యాన్స్
ఈ సిరిస్ విజయానికి కారణమైన పుజారా చేయి పట్టుకుని రిషబ్ పంత్ డ్యాన్స్ చేయడం క్రికెట్ అభిమానులను అలరించింది. అదే సమయంలో పుజారాని డ్యాన్స్ చేయమని పంత్ ఒత్తిడి చేయగా అతడు డ్యాన్స్ చేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఈ సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచిన పుజారాకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో వైరల్
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో టీమిండియా డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మీరు చేసిన డ్యాన్స్ ఏం డ్యాన్స్ అని కోహ్లీని విలేకర్లు ప్రశ్నించగా తనకు తెలియదని, పంత్ అలా డ్యాన్స్ చేయడం చూసి మిగతా అందరం డ్యాన్స్ చేశామని బదులిచ్చాడు.
వర్షం కారణంగా
సిడ్నీ వేదికగా ప్రారంభమైన చివరి టెస్టులో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ వర్షం పదే పదే అంతరాయ కలిగించడంతో పూర్తి ఆట సాధ్యం కాలేదు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 622/7 డిక్లేర్ చేయగా, ఆసీస్ తన మొదటి ఇన్నింగ్స్లో 300 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫాలో ఆన్కు ఆహ్వానించాడు. నాలుగో రోజైన ఆదివారం ఆటలో ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా ఆరు పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం పడింది.
చివరిరోజు ఒక్క బంతి కూడా పడలేదు
చివరి రోజు ఆటకు సైతం వరుణుడు అడ్డుపడటంతో ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది. సిడ్నీ టెస్టులో సెంచరీ సాధించిన ఛటేశ్వర్ పుజారా(193) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించగా, పెర్త్లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ 146 పరుగుల తేడాతో నెగ్గింది.
2-1తో సిరిస్ కైవసం
ఆ తర్వాత మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 137 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి సిరిస్లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరిస్లో పుజారా 521 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, భారత బౌలర్లలో బుమ్రా (21 వికెట్లు) అగ్రస్థానంలో నిలవగా షమీ 16 వికెట్లు, ఇషాంత్ శర్మ 11 వికెట్లు తీశారు. ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ విజయం సాధించడంతో టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications