
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో న్యూజిలాండ్ 247 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాత్రం అభిమానుల మనసు గెలుచుకున్నాడు. 487 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 240 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకుంది.
ఓపెనర్ టామ్ బ్లండెల్ (121; 210 బంతుల్లో 15 ఫోర్లు) సెంచరీతో మెరిసినప్పటికీ.. ఆసీస్తో రెండో టెస్టులో కివీస్కు పరాభవం తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో లియాన్ 4 వికెట్లతో చెలరేగగా, ప్యాటిన్సన్ 3 వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్ల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అయితే, మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్టేడియంలోని అభిమానుల గ్యాలరీ వద్దకు వచ్చి ధన్యవాదాలు తెలిపాడు. "మేము ఓటమికి గురవుతున్నా.. మీరు మాపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞులం. ఇలాంటి సన్నివేశం అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమవుతుందేమో" అని అభిమానులతో అన్నాడు.
తమపై చూపిస్తున్న ఆదరణకు తదుపరి మ్యాచ్లో గెలిచేందుకు తప్పక ప్రయత్నిస్తామని అన్నాడు. కాగా, విలియమ్సన్ మాట్లాడిన తర్వాత ప్రేక్షకులు గ్యాలరీలో నుంచి చప్పట్లు కొడుతూ అతడిని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకానోక దశలో ఆ జట్టు 89 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. నికోల్స్ (33), వాట్లింగ్ (22), శాంట్నర్ (27) తోడుగా కివీస్ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే భాగస్వామ్యాలు కుదురుకున్న సమయంలో ఆసీస్ బౌలర్లు వరుసగా వికెట్లు తీసి కివీస్ను దెబ్బతీశారు. ఈ సిరీస్లో ఆఖరిదైన మూడో టెస్టు జనవరి 3న సిడ్నీలో జరగనుంది.