
హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా మొహాలీ వేదికగా తీవ్రంగా శ్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఆశలు సజీవంగానే ఉంచుకున్న ధోనీ, వెన్నునొప్పితో బాధపడుతున్నా.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో ధోనీ కూతురు తన తండ్రి దగ్గరకు తీసుకెళ్లమంటూ చిట్టి చిట్టి మాటలతో స్టేడియంలో ఉన్నవాళ్లని అడిగిందట.
మ్యాచ్ అనంతరం ధోనీ తన కూతురికి సంబంధించిన ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. మహేంద్రసింగ్ ధోనీ 44 బంతుల్లో (79) ఇన్నింగ్స్ ఆకట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఆఖర్లో విజృంభించిన మహీ చెన్నై అభిమానులకు గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ధాటిగా ఆడటంలో ధోనీ ఆలస్యం చేయడంతో చివర్లో సాధించాల్సిన టార్గెట్ పెరిగిపోవడమే చెన్నై జట్టును ఓడిపోయేలా చేసింది.
ధోనీ మెరిసినా చెన్నై 5 వికెట్లకు 193 పరుగులే చేయగలిగింది. ఐతే ఓవైపు ధోనీ తన ట్రేడ్ మార్క్ షాట్లతో చెలరేగుతుంటే తన ముద్దుల కూతురు జీవా ధోనీ కూడా మహీ బ్యాటింగ్ను ఆస్వాదించింది. తన తల్లి సాక్షి దగ్గర గ్యాలరీలో కూర్చొన్న జీవా మ్యాచ్ మధ్యలో తన తండ్రి ధోనీని హగ్ చేసుకోవాలని కోరుకుంది. మీ నాన్న దగ్గరికి వెళ్తే ఏం చేస్తావ్? అని పక్కనున్నవారి అడగ్గా.. హగ్ చేసుకుంటానని తన ముద్దు ముద్దు మాటలతో జవాబిచ్చింది. ఎలా హగ్ చేసుకుంటావ్ అని సాక్షి అడగడంతో జీవా అందుకు తగ్గట్లుగా చేసి చూపించింది. మైదానంలో ధోనీ ఎక్కడున్న విషయాన్ని కూడా చేతితో చూపించి గ్యాలరీలో సందడి చేసింది. అక్కడున్న వ్యక్తిని నువ్వు కూడా చెన్నై జట్టు జెర్సీ వేసుకున్నావ్ కదా.. స్టేడియంలోకి వెళ్లొచ్చు కదా అని అడిగింది.