అసలేం జరిగిందంటే..?
1992 వన్డే వరల్డ్ కప్లో 18 వికెట్లు తీసి పాక్ విజయంల కీలక పాత్ర పోషించిన వసీం అక్రమ్.. 1996 వన్డే వరల్డ్ కప్లో పాకిస్థాన్ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే క్వార్టర్ ఫైనల్లో టీమిండియాతో జరిగిన మ్యాచ్లో వసీం అక్రమ్ ఆడకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. వసీం అక్రమ్ గైర్హాజరీకి సంబంధించి అప్పట్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి ప్రకటన చేయలేదు. గాయమైందా? లేక కావాలనే తప్పుకున్నాడా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మ్యాచ్ ఆరంభానికి ముందు వసీం అక్రమ్ ఆడడం లేదని చెప్పడంతో కెప్టెన్ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడనే ఆరోపణలు షికారు చేశాయి.
ఎందుకు ఆడలేదంటూ..
ఈ మ్యాచ్లో భారత జట్టు 39 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. పాక్ కెప్టెన్ వసీం అక్రమ్ ఉండి ఉంటే, పాకిస్తాన్ ఈజీగా సెమీస్ చేరేదనే అభిప్రాయం పాక్ అభిమానులు వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరిగి 26 ఏళ్లు గడుస్తున్నా వసీం అక్రమ్కు ఈ మ్యాచ్ గురించి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ఇదే విషయంపై సూటిగా ప్రశ్నించాడు. '1996 వన్డే వరల్డ్ కప్ సమయంలో భారత్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఎందుకు ఆడలేదో చెప్పాలి'అని అడిగాడు.
గాయం వల్లే..
దాంతో వసీం అక్రమ్... 'ఈ ప్రశ్నకు ఇకనైనా సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఈ తరంలో చాలామంది దీని గురించి నన్ను ప్రశ్నిస్తున్నారు. మీరు రూమర్లను నమ్మడం మానేస్తే మంచిది. అది జరిగినప్పుడు నువ్వు పుట్టి కూడా ఉండవు. అయినా ఇప్పటికీ ఏదోటి అనాలని దాడి చేస్తున్నారు. దానికి ముందు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో నాకు గాయమైంది. ఆ మ్యాచ్లో నేను 34 పరుగులు చేశా. స్వీప్ షాట్ ఆడినప్పుడు నా పక్క కండరాలు పట్టేశాయి. దాని నుంచి కోలుకోవడానికి 6 వారాల సమయం పట్టింది. అందుకే ఆ మ్యాచ్ ఆడలేదు.
భారత్కు తెలియవద్దనే..
అయితే క్వార్టర్ ఫైనల్కు ముందు కెప్టెన్కు గాయమైందంటే భారత జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కీలక ప్లేయర్ ఆడడం లేదని తెలిస్తే వాళ్లు మరింత జోష్గా ఆడతారు. అందుకే ఎవ్వరికీ ఈ విషయం చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు ఉదయం కూడా నాకు రెండు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు ఇచ్చారు. అయినా వర్కవుట్ కాలేదు. ఆ నొప్పితో ఆడి ఉంటే నన్ను ఇంకా ఎక్కువగా ట్రోల్ చేసేవాళ్లు, మరో ప్లేయర్ లేక ఇలా ఆడుతున్నావా? అంటూ తిట్టేవాళ్లు. నేను ఆడకపోవడం వల్లే టీమిండియాతో ఓడిపోయామనడంలో ఎలాంటి లాజిక్ ఉందో నాకు అర్థం కావడం లేదు. నేను ఆడలేని పరిస్థితుల్లో ఉన్నా కాబట్టి ఆడలేదు.'అంటూ వసీం అక్రమ్ వివరణ ఇచ్చాడు.