భారత మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఈరోజు 34 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్లో రహానేకు అభినందనలు చెబుతూ అభిమానులు కామెంట్లు, పోస్టులు చేస్తున్నారు. ఇక పలువురు క్రికెట్ సోదరులు కూడా రహానెకు తమ విషెస్ తెలిపారు. అతనికి విషెస్ చెప్పినవారిలో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన విష్ కాస్త వెరైటీగా, ఆలోచన రేకెత్తించేదిగా ఉంది. అడిలైడ్లో జరిగిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ 36/9తో దారుణ పరాభవం పొందగా.. ఆస్ట్రేలియా 0-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన కూతురు బర్త్ డే కోసం ఇంటికెళ్లగా టెస్ట్ కెప్టెన్సీ అందుకున్న రహానే సారథ్యంలో టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. మెల్బోర్న్ టెస్ట్లో గెలిచిన టీమిండియా, సిడ్నీ టెస్ట్ డ్రా చేసుకుంది. తర్వాత బ్రిస్బేన్లోని గబ్బాలో టెస్ట్ మ్యాచ్ గెలిచి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై భారత్ 2-1తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.
ఇక సెహ్వాగ్ విషెస్ చెబుతూ.. పొందాల్సినదానికంటే అత్యంత తక్కువ గుర్తింపు పొందిన ఒకానొక క్రికెటర్ రహానే, చరిత్రాత్మక టెస్ట్ సిరీస్ గెలవడంలో టీమిండియాను నడిపించిన ప్లేయర్. హ్యాపీ బర్త్ డే రహానే, నీ భవిష్యత్తులో అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవడానికి ఆ దేవుడు నీకు తగినంత స్థైర్యం ప్రసాదించుగాక అంటూ సెహ్వాగ్ విషెస్ తెలిపాడు.
One of the most underrated cricketers, and the man who led India to it's greatest ever overseas Test series win. Happy Birthday @ajinkyarahane88 . May God give you the strength to fight every challenge. pic.twitter.com/0isbDzFGOc
— Virender Sehwag (@virendersehwag) June 6, 2022
రహానేను అత్యంత తక్కువ అంచనా వేసిన ప్లేయర్గా సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక సెహ్వాగ్ ట్వీట్ అంతరార్థం ఏమిటంటే.. టీమిండియా తరఫున అత్యంత కీలక మైన ప్లేయర్ గా కొనసాగినప్పటికీ.. అతనికి తగినంత గుర్తింపు దక్కలేదని తెలుస్తుంది. నిజానికి రహానె.. విదేశీ గడ్డపై టెస్ట్లలో నంబర్ 5 ప్లేయర్గా కీలక ఇన్నింగ్స్ ఎన్నో సందర్భాల్లో ఆడాడు.
రహానే 2011లో ఇంగ్లాండ్ మీద తన టీ20, వన్డే మ్యాచ్లలో అరంగేట్రం చేశాడు. అతను 2013లో ఆస్ట్రేలియాతో తన మొదటి టెస్ట్ ఆడాడు. అతని కెరీర్లో ఇప్పటివరకు టీమిండియా తరపున 82 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిసి 8,268 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన రహానే, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఐపీఎల్ 2022 సీజన్లో ఆడాడు.