హుందాగా వ్యవహరించాలని విరాట్ కోహ్లీకి చెప్పాం
"మీడియా సమావేశాల్లో, అభిమానులతో మాట్లాడే సమయంలో హుందాగా వ్యవహరించాలని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెప్పాం" అని బీసీసీఐ పాలకుల కమిటీ తెలిపినట్లు ముంబై మిర్రర్లో వార్తా కథనం వచ్చింది. ఈ కథనం ప్రకారం సీఓఏ మెంబర్ తొలుత కోహ్లీతో వాట్సాఫ్లో చాట్ చేసి, ఆ తర్వాత ఫోన్లో మాట్లాడారని పేర్కొంది.
కోహ్లీని ‘‘ఓవర్రేటెడ్ ప్లేయర్'' అన్న అభిమాని
కోహ్లీ తన పుట్టినరోజు నాడు ఓ యాప్ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఓ క్రికెట్ అభిమాని విరాట్ కోహ్లీని ‘‘ఓవర్రేటెడ్ ప్లేయర్'' అని పేర్కొన్నాడు. ‘‘విరాట్ కోహ్లీ ఓ ఓవర్రేటెడ్ బ్యాట్స్మెన్. అతనిలో నాకు ఏదీ ప్రత్యేకంగా కనిపించదు. ఇండియా వాళ్ల కంటే ఇంగ్లీష్, ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ల బ్యాటింగ్ నాకు ఎంతో నచ్చుతుంది'' అని పేర్కొన్నాడు.
భారత్లో ఉండాల్సిన వాడివి కాదు
ఈ వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ సమాధానమిస్తూ ‘‘నువ్వు భారత్లో ఉండాల్సిన వాడివి కాదు. ఎక్కడికైనా వెళ్లి బతుకు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో. వేరే దేశాలను ప్రేమిస్తూ.. ఇక్కడ ఎందుకు ఉండటం. నీవు నన్ను అభిమానించ మాత్రాన నాకేం కాదు. నీకు ఈ దేశం సరైంది కాదు. కానీ ఇక్కడ ఉంటూ వేరే దేశాన్ని పొగడటం నాకు ఇష్టం ఉండదు'' అని అన్నాడు.
2012లో మధ్య వేలు చూపించిన కోహ్లీ
కోహ్లీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. అంతేకాదు 2012 ఆస్ట్రేలియా పర్యటనలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ అభిమానులు గేలి చేయడంతో అసభ్యకరంగా మధ్య వేలుని చూపించి విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2014లో మిచెల్ జాన్సన్తో కవ్వింపులకి దిగాడు. దీంతో, తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై వ్యవహరించాల్సిన తీరుపై అతనికి కమిటీ సలహాలు, సూచనలు చేసినట్లు తెలుస్తోంది.