
హైదరాబాద్: వచ్చే నెలలో శ్రీలంక వేదికగా జరిగే ముక్కోణపు టీ20 సిరీస్కు ప్రస్తుత జట్టులోని పలువురు ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిశ్చయించుకుంది. శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నిదాహాస్ ట్రోఫీ పేరిట ముక్కోణపు టీ20 సిరిస్ను నిర్వహిస్తోంది. ఈ టీ20 సిరిస్లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పాల్గొనున్నాయి.
మార్చి 6 నుంచి జరిగే సిరిస్లో టీమిండియాకు చెందిన పలువురు సీనియర్ ఆటగాళ్లు దూరం కానున్నారు. గతేడాది డిసెంబరులో శ్రీలంకతో వరుస సిరీస్లు ముగిసిన మూడు రోజుల వ్యవధిలోనే కోహ్లీ సేన దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది. దీంతో విరామం లేకుండానే ఆతిథ్య దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ మొదలెట్టింది.
దీని ఫలితంగా మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను కోహ్లీసేన 1-2తో చేజార్చుకుంది. సఫారీ పర్యటనలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం బీసీసీఐ బిజీ షెడ్యూల్పై కోహ్లీ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు విశ్రాంతి కరువైందని కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు.
మరోవైపు దక్షిణాఫ్రికా కూడా భారత్తో మూడు టీ20 సిరీస్ ముగిసిన తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడనుందది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశ బోర్డు జట్టులోని స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని సుదీర్ఘమైన సఫారీ పర్యటన ముగిసిన తర్వాత పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించనుంది.
ఈ మేరకు బీసీసీఐ నిర్ణయం కూడా తీసుకుంది. అయితే, జట్టులో ఎవరెవరికి విశ్రాంతి కల్పించాలన్న దానిపై బీసీసీఐ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. శ్రీలంక పర్యటనకు జట్టుని ఎంపికే చేసే ముందు సెలక్టర్లు కోహ్లీ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. కోహ్లీ గనుక విశ్రాంతి కావాలని అడిగితే అతడిని జట్టులో ఎంపిక చేయకపోవచ్చు. కోహ్లీని తప్పిస్తే జట్టు పగ్గాలు రోహిత్ శర్మకు దక్కే అవకాశం ఉంది.
'కోహ్లీకి విశ్రాంతి కావాలని కోరితే తప్పక లభిస్తుంది. ఒక్క విరాట్ కోహ్లీ విషయంలో నిర్ణయం అతడికే వదిలేశాం. విరామం వద్దని చెప్పినా మాకెలాంటి అభ్యంతరం లేదు. ముక్కోణపు సిరీస్ ముగియగానే ఆటగాళ్లంతా తిరిగి భారత్ చేరుకుని ఐపీఎల్తో బిజీ అవుతారు' అని బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక, సఫారీ పర్యటనలో భాగంగా భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లకు కూడా విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది.
వీరి స్థానంలో రిషబ్ పంత్, సంజు శాంసన్, మయాంక్ అగర్వాల్తో పాటు మరికొందరికీ అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ఆలోచనగా తెలుస్తోంది. భారత్-శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ మార్చి 6న ప్రారంభంకానుంది. ఈ టోర్నీ రౌండ్ రాబిన్ పద్దతిన జరుగుతుంది. ఒక్కో జట్టు మిగిలిన జట్లతో రెండు మ్యాచ్లు ఆడాలి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య మార్చి 18న ఫైనల్ జరగనుంది.
శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత భారత్లో ఏప్రిల్లో ఐపీఎల్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత కోహ్లీసేన స్వదేశంలో బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్తో ఏకైక టెస్టు, ఆ తర్వాత వెంటనే ఐర్లాండ్తో టీ20లు ఆడి ఇంగ్లాండ్కు పయమవుతుంది.