తుది జట్టులో చోటు కోసమే
తుది జట్టులో చోటు కోసమే వీరిద్దరూ ఇప్పుడిలా ఆడుతున్నారంటూ అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై మూడో టీ20 అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. కోహ్లీ మాట్లాడుతూ "మన ఓపెనర్లందరూ బలమైన ఆటగాళ్లు. జట్టులో అందరూ బాగా ఆడుతుండటం మంచి విషయం. ఇలాంటపుడు ప్రత్యామ్నాయాలు పెరుగుతాయి" అని అన్నాడు.
ఒకరితో మరొకరు పోటీ
"ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారనే మాటలు నేను నమ్మను. అయితే ఒకరికి ఒకరిని శత్రువుల్లా చూపించే ధోరణిని జనాలు విడిచిపెట్టాలి. దీన్ని నేను ప్రోత్సహించను. ఎందుకంటే ఇది జట్టు ఆట. మధ్య ఓవర్లలో దెబ్బ తిన్నప్పటికీ మనీష్ పాండే, శార్దూల్ ఠాకూర్లు సవాల్ను స్వీకరించి జట్టుకు మంచి స్కోరు అందించారు" అని కోహ్లీ పేర్కొన్నాడు.
ఏడాది ఆరంభపు సిరీస్ను క్లీన్స్వీప్ చేయడంపై
ఇక ఏడాది ఆరంభపు సిరీస్ను క్లీన్స్వీప్ చేయడంపై కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. "కొత్త ఏడాదిలో శుభారంభం లభించింది. సరైన దిశలో అడుగు వేశాం. రెండు మ్యాచ్లలో చక్కటి ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. ఒక మ్యాచ్లో ఛేదించాం. మరో మ్యాచ్లో లక్ష్యాన్ని నిర్దేశించాం. మొత్తంగా సమష్టి ప్రదర్శన చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది" అని కోహ్లీ అన్నాడు.
స్కోరు బోర్డు 200 మార్క్ దాటితే
"స్కోరు బోర్డు 200 మార్క్ దాటితే ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఒక దశలో 180 స్కోరు సాధిస్తామనుకున్నాం. కానీ 200 దాటింది. ఇన్నింగ్స్ మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోయినా మనీశ్ పాండే, శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా ఆడారు. సీనియర్ ఆటగాళ్లు విఫలమైనప్పుడు.. ఎవరు బాధ్యత తీసుకోగలరో, ఎవరు చేతులెత్తేస్తారో తెలియాలంటే ఇలాంటి సందర్భాలు మరిన్ని రావాలి" అని కోహ్లీ చెప్పాడు.