తొలి టెస్టు ఓటమిపై కోహ్లీ.. చివరి మూడు వికెట్లే మా కొంప ముంచాయి!!?

వెల్లింగ్టన్: భారత్తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌట్ కాగా.. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ 183 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో.. రెండో ఇన్నింగ్స్లో 9 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్లో తొలి ఓటమిని చవిచూసింది.

ఆ మూడు వికెట్లు తీయడంలో విఫలమయ్యాం
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మొదటి రోజు టాస్ చాలా ముఖ్యమైనది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న మేము ఈ మ్యాచ్లో పోటీ ఇవ్వలేకపోయాం. కివీస్ బౌలర్లు ఇంతలా ఒత్తిడికి గురిచేస్తారనుకోలేదు. మేం 220-230 స్కోర్ చేసినా సరిపోయేది కాదు. తొలి ఇన్నింగ్స్లో చేసిన తక్కువ పరుగులే మ్యాచ్లో మేం వెనుకపడేలా చేసింది. తొలి ఇన్నింగ్స్లో కివీస్ ఆధిక్యాన్ని 100లోపే కట్టడి చేయాలనుకున్నాం. కానీ.. చివరి మూడు వికెట్లు తీయడంలో బౌలర్లు విఫలమయ్యారు' అని అన్నాడు.

ఒక్కోసారి ఇలా జరుగుతుంది
'మా బౌలర్లు రాణించేందుకు కివీస్ ముందు పెద్ద స్కోర్ ఉంచాల్సింది కానీ.. ఈ మ్యాచ్లో మేం అదే చేయలేకపోయాం. 7 వికెట్లు వరకు బౌలర్లు బాగా రాణించారు. చివరి 3 వికెట్లు చేసిన 120 పరుగులు మమ్మల్ని ఆట నుండి దూరం చేసాయి. బాగా ప్రయత్నం చేసాం కానీ.. కుదరలేదు. ఇంకా క్రమశిక్షణతో ఆడాల్సి ఉంది. బౌలర్లను నిందించాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఒక్కోసారి ఇలా జరుగుతుంది' అని కోహ్లీ పేర్కొన్నాడు.

తొందరపడాల్సిన అవసరం లేదు
'యువ ఓపెనర్ పృథ్వీ షా విషయంలో అప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటాడు. అతను ఓవర్సీస్లో ఆడింది రెండు టెస్టులే. భవిష్యత్లో పృథ్వీ కచ్చితంగా రాణిస్తాడు. రెండు ఇన్నింగ్స్లలో మయాంక్ అగర్వాల్ అత్యుత్తమంగా ఆడాడు. అజింక్య రహానె తర్వాత బ్యాటింగ్లో మయాంక్ ఒక్కడే నిలకడగా రాణించాడు. మేము బ్యాటింగ్ యూనిట్గా రాణించాలి. రెండో టెస్టులో బాగా రాణిస్తాం' అని కోహ్లీ ధీమా వ్యక్తం చేసాడు.

పరుగుల వరద పారించిన జేమీసన్, బోల్ట్:
తొలి ఇన్నింగ్స్లో కివీస్ 348 పరుగుల భారీ స్కోరు చేయడంలో టెయిలెండర్ల పరుగులే కీలకం. కైల్ జేమీసన్ (45 బంతుల్లో 44; 1 ఫోర్, 4 సిక్స్లు) మరోసారి చెలరేగాడు. ఇక 11వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన ట్రెంట్ బౌల్ట్ (24 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీలతో హోరెత్తించాడు. ఈ ఇద్దరే భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నారు.

9 పరుగుల లక్ష్యం:
మూడో రోజు ఆట ముగిసే సరికి 65 ఓవర్లలో 4 వికెట్లకు 144 పరుగులు చేసిన భారత్.. నాల్గవ రోజు బ్యాటింగ్ కొనసాగించి రెండో ఇన్నింగ్స్ లో 191 పరుగులకే ఆలౌటైంది. మయాంక్ (58), రహానె (29) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లు కనీస ఆటతీరును కూడా కనబర్చలేకపోయారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ 5/61, ట్రెంట్ బౌల్ట్ 4/39 చుక్కలు చూపించారు. అనంతరం 9 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications