బెంగళూరు: జనవరి 24 నుంచి న్యూజిలాండ్తో భారత్ అయిదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. గతేడాది పర్యటనలో న్యూజిలాండ్లో పర్యటించిన భారత జట్టు వన్డే సిరీస్లో 4-1తో కైవసం చేసుకుంది. అయితే టీ20 సిరీస్ను మాత్రం 1-2తో కోల్పోయింది. నిర్ణయాత్మక పోరులో ఆస్ట్రేలియాపై సాధించిన విజయంతో కివీస్ పర్యటనకు రెట్టింపు ఉత్సాహంతో బయలుదేరుతామని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన చివరి వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్.. ప్రజ్నేశ్ గుణేశ్వరన్కు భారీ షాక్!!
కివీస్ పర్యటన సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'గత ఏడాది కివీస్ పర్యటనలో మేం బాగా రాణించాం. ఈసారి కూడా మంచి ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం చేయాలో మాకు బాగా తెలుసు. అప్పుడు న్యూజిలాండ్ గడ్డపై సాధించిన విజయం నుంచి మేం స్ఫూర్తి పొందుతున్నాం. సొంతమైదానాల్లో కివీస్ను ఒత్తిడిలోకి తీసుకువస్తే ఆటను ఆస్వాదించవచ్చు. గతంలో అలానే చేశాం. ఈసారీ అదే జోరును కొనసాగిస్తాం' అని తెలిపాడు.
'గత పర్యటనలో మిడిల్ ఓవర్లలో వికెట్లను తీసి వారిని కట్టడి చేశాం. స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ సారి కూడా అలాంటి ప్రదర్శనే చేయాలి. తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు మంచి స్కోరు సాధించాలి. ఒకవేళ సాధ్యం కాకపోతే.. స్కోరు కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. కివీస్ పర్యటనలో శుభారంభం చేయాలి. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగితే మంచి ఆరంభం దక్కుతుంది. తొలి రెండు మ్యాచుల్లో ఆశించిన ఫలితం రాకపోతే.. తర్వాత కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే తొలి మ్యాచ్లో విజయం సాధించి ఆధిక్యంలోకి ఉండటానికి ప్రయత్నిస్తాం' అని కోహ్లీ పేర్కొన్నాడు.
'లోకేష్ రాహుల్ ఏ స్థానంలోనైనా ఆడగలడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వికెట్ కీపింగ్ కూడా చేస్తే జట్టు మంచి సమతూకంతో ఉంటుంది. దీనివల్ల అదనపు బ్యాట్స్మన్ను తీసుకునే అవకాశం కూడా మనకు దొరుకుతుంది. గతంలో రాహుల్ ద్రవిడ్ ఇలాగే చేశారు. అయితే నా అభిప్రాయాన్ని తప్పుగా కూడా అర్థం చేసుకోవద్దు. కీపర్లుగా ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్, సంజు సాంసన్ అవకాశాలను కొట్టివేసినట్లు కాదు. మనకు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని చెపుతున్నా' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.