2-3 ఓవర్ల కీపింగ్ చేయమన్నాడు:
టీమిండియా టెస్ట్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నిర్వహిస్తున్న 'ఓపెన్ నెట్స్ విత్ మయాంక్' చాట్ షోలో పాల్గొన్న విరాట్ కోహ్లీ.. 2015లో బంగ్లాదేశ్తో జరిగిన ఒక వన్డే మ్యాచ్ను గుర్తుచేసుకున్నాడు. '2015లో బంగ్లాదేశ్తో వన్డే మ్యాచ్ జరుగుతోంది. 44వ ఓవర్లో మహీ భాయ్ నా దగ్గరకు వచ్చాడు. తాను రెస్ట్ రూమ్కు వెళ్తానని చెప్పి.. 2-3 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాలన్నాడు. మా జట్టుకు నాయకత్వ స్థానంలో ఉన్న ధోనీ మాటను అంగీకరించి కీపింగ్ బాధ్యతలు చేపట్టాను' అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
ఆ రోజు తెలిసింది:
'44వ ఓవర్లో బయటకు వెళ్లిన ధోనీ.. 45వ ఓవర్ పూర్తి కాగానే తిరిగి వచ్చాడు. కీపింగ్ బాధ్యతలు చేపట్టిన ఆ రెండు ఓవర్లు నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఒకవైపు కీపింగ్ చేస్తూనే.. ఫీల్డింగ్తో పాటు బౌలర్ వేస్తున్న బంతిని గమనించాలి. నిజంగా ఇది చాలా కష్టం. అప్పడు అర్థమయింది.. వికెట్ కీపింగ్ బాధ్యతలు ఎంత కష్టంగా ఉంటాయో అని. ఇక ధోనీ కెప్టెన్గా ఉండడంతో అటు కీపింగ్ చేస్తూనే ఫీల్డింగ్పై కూడా ఫోకస్ పెట్టేవాడు. ఆ రోజు తెలిసింది నాకు కెప్టెన్గా, కీపర్గా ధోనీపై ఒత్తిడి ఎంతఉంటుందో' అని విరాట్ కోహ్లీ తెలిపాడు.
బంతి ముఖానికి తగిలితే:
ఉమేష్ యాదవ్ బౌలింగ్ చేస్తుండగా.. తాను పెద్ద ప్రమాదంలో ఉన్నానని కూడా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. 'కీపింగ్ చేస్తున్న సమయంలో ఉమేష్ యాదవ్ బౌలింగ్ చేశాడు. అతడు వేసే బంతి ముఖానికి తగిలితే నా పరిస్థితి ఏంటి అని అనుకున్నా. వెంటనే హెల్మెట్ ధరించాలనుకున్నా. కానీ చాలా అవమానకరంగా భావించి పెట్టుకోలేదు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఉమేష్ బౌలింగ్లో తాను భయపడ్డానని విరాట్ తెలిపాడు.
మర్చిపోలేని మధురానుభూతి:
2011 ప్రపంచకప్ ఫైనల్ అనంతరం సచిన్ను భుజాలపై ఎత్తుకోవడానికి గల కారణాన్ని కూడా కోహ్లీ చెప్పాడు. 'ముందుగా మేం ప్రపంచకప్ గెలిచినందుకు చాలా గొప్పగా అనిపించింది. అది మర్చిపోలేని మధురానుభూతి. ఆ సమయంలో మాకు తెలియకుండానే మేమంతా పాజీ చుట్టూ చేరాం. ఎందుకంటే అది సచిన్కు చివరి వరల్డ్కప్ అని మా అందరికీ తెలుసు. కొన్నేండ్లుగా భారత్ను గెలిపించడానికి సచిన్ అలుపెరగని పోరాటం చేశాడు. అలాంటి వ్యక్తికి మేమిచ్చిన పెద్ద గిఫ్ట్ ప్రపంచకప్. భారత క్రికెట్ను 21 ఏళ్లుగా మోశాడు. అందుకే ఆక్షణాన మేం సచిన్ను మా భుజాలపై ఎత్తుకున్నాం. తన సొంత మైదానంలో సచిన్ కల నెరవేరిందని మేమంతా భావించాం. అందుకే గౌరవ సూచకంగా భుజాలపై ఎత్తుకున్నం' అని చెప్పకొచ్చాడు.