పీటర్సన్ అయితే కాదు:
తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్తో లైవ్లో ముచ్చటించిన విరాట్ కోహ్లీ అనేక విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. లైవ్లో కోహ్లీని చిక్కుల్లో పడేసేలా పీటర్సన్ ఒక ప్రశ్న అడగ్గా.. దానికి సరదా జవాబిచ్చి ఇచ్చి తన చిలిపితనాన్ని మరోసారి చాటుకున్నాడు. ఇష్టమైన కామెంటేటర్ ఎవరని అడిగి.. ఆచితూచి సమాధానం ఇవ్వాలని కేపీ సూచించాడు. 'ఫేవరెట్ కామెంటేటర్ ఎవరలో చెప్పడం ఎంతో సులభమని, పీటర్సన్ అయితే కాదు' అని కోహ్లీ కొంటె సమాధానం ఇచ్చాడు. దీనికి పీటర్సన్ నవ్వుకున్నాడు.
అభిమాన కామెంటేటర్ హుస్సేన్:
తన అభిమాన కామెంటేటర్ ఎవరో చెప్పాలా అని పీటర్సన్ను కాపేపు కోహ్లీ ఆటపట్టించాడు. కొద్ది సమయం తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ నా అభిమాన కామెంటేటర్ అని కోహ్లీ చెప్పాడు. తన దేశానికే చెందిన మాజీ క్రికెటర్ను కోహ్లీ తన ఫేవరెట్ కామెంటేటర్గా చెప్పడంతో.. పీటర్సన్ ఆనందం వ్యక్తం చేసాడు. దీనికి సంబందించిన చాట్ను కేపీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. మరోవైపు రవిశాస్త్రి, హర్ష భోగ్లే పేర్లను కోహ్లీ చెపుతాడని ఆశించిన భారత అభిమానులు నిరాశకు గురయ్యారు.
ధోనీతో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతా:
ఇన్స్టాగ్రామ్ లైవ్చాట్ సందర్భంగా.. మైదానంలో ఎవరితో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతావు? అని కోహ్లీని పీటర్సన్ ప్రశ్నించగా.. ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్ అని సమాధానం ఇచ్చాడు. ఆటలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నా మిత్రులపై మాత్రం ఆగ్రహం చూపించలేనని అన్నాడు. 'నాతో పోటీపడుతూ వేగంగా వికెట్ల మధ్య పరుగెత్తే వాళ్లతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తాను. టీమిండియా తరఫున ఆడే సమయంలో ధోనీ.. ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడేటప్పుడు డివిలియర్స్ నా జాబితాలో ఉన్నారు. ఈ ఇద్దరితో కలిసి బ్యాటింగ్ చేసే సమయంలో వికెట్ల మధ్య పరుగు కోసం ప్రత్యేకంగా పిలుపులు ఉండవు. ఒకరినొకరు చూసుకుని పరుగెత్తేస్తామంతే' అని కోహ్లీ తెలిపాడు.
114మంది మృతి:
విరాట్ కోహ్లీ కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4421కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 114మంది మరణించగా 3981 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 326 మంది కొవిడ్-19 నుంచి కోలుకున్నారు.