టాప్ క్రికెటర్గా కోహ్లీ:
2015 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు మరియు క్రికెట్ జట్లను ఎన్నిసార్లు శోధించారో 'SEMrush' అనే ఆన్లైన్ సంస్థ ఓ జాబితాను విడుదల చేసింది. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించబడిన క్రికెటర్ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లీని నెలకు సగటున 1.76 మిలియన్ల సార్లు ఇంటర్నెట్లో వెతికారట. ఎప్పటికప్పుడు కోహ్లీ పలు రికార్డులు బద్దలు కొట్టడంతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
ధోనీ @ 2:
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించబడిన క్రికెటర్ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రెండవ స్థానంలో ఉన్నాడు. మహీని నెలకు సగటున 9.59 మంది శోధించారట. గత ఏడాది 2019 ప్రపంచకప్ తర్వాత నుండి టీమిండియా తరఫున ఆడకపోయినప్పటికీ ధోనీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతని భవిష్యత్తు గురించి పలు ఊహాగానాలతో కోహ్లీ తర్వాత నిలిచాడు.
టీమిండియా క్రికెటర్లదే హవా:
ఈ జాబితాలో ఓపెనర్ రోహిత్ శర్మ (7.33 లక్షలు), క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (4.51 లక్షలు), ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (3.68 లక్షలు), మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (3.48 లక్షలు)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. స్టీవ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్లు టాప్-10లో ఉన్నారు. క్రికెట్లోని పది మంది అత్యుత్తమ ఆటగాళ్లలో టీమిండియా క్రికెటర్లే ఎక్కువగా ఉన్నారు.
టీమిండియా @ 1:
భారత్తో పాటు విదేశాల్లోని భారత్కు చెందిన వారే మన క్రికెటర్ల గురించి ఎక్కువగా శోధించారని 'SEMrush' ఆన్లైన్ సంస్థ చెప్పింది. మరోవైపు టీమిండియాను కూడా ఎక్కువగానే వెతికారని పేర్కొంది. టీమిండియా తర్వాత అత్యధికంగా వెతికిన జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. వెస్టిండీస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.