ముంబై: ట్రెంట్ బ్రిడ్జి టెస్టులో తొలి రోజు అద్భుతంగా ఆడిన కోహ్లి మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 152 బంతుల్లో 97 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న విరాట్.. క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టెస్టు కెరీర్లో కోహ్లి 90ల్లో అవుటవడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. 2013లో దక్షిణాఫ్రికాపై 96 పరుగుల వద్ద విరాట్ అవుటయ్యాడు.
ఇలా విరాట్ కోహ్లి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అజింక్య రహానెతో కలిసి నాలుగో వికెట్కి 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టుని మెరుగైన స్థితిలో నిలిపిన విరాట్ కోహ్లీ (97: 152 బంతుల్లో 11 ఫోర్లు) స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో.. 279 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ చేజార్చుకుంది.
ఇంగ్లాండ్తో మూడో టెస్టులో ఆడిన కోహ్లీ శనివారానికి క్రికెట్లోకి అడుగుపెట్టి పదేళ్లు. అదే రోజు సెంచరీ సాధించే అవకాశాన్ని విరాట్ కొద్దిలో కోల్పోయాడు. కానీ మరో రికార్డును మాత్రం ఖాతాలో వేసుకున్నాడు. విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. గంగూలీ 43 ఇన్నింగ్స్ల్లో 1693 పరుగులు చేయగా.. ఆ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. కెప్టెన్గా కోహ్లి విదేశాల్లో 30 ఇన్నింగ్స్ ఆడగా.. 59.68 సగటుతో 1731 పరుగులు చేశాడు. భారత బ్యాటింగ్కు వెన్నెముకగా మారిన విరాట్.. ఎడ్జ్ బాస్టన్ టెస్టులో 200 (149, 51) పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్ ఇండియాల మధ్య జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ను ముగించిన భారత్.. 307 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు బరిలోకి దిగిన కాసేపటికే పంత్ (24) వికెట్ కోల్పోయింది. బరిలో రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ ఆడుతున్నారు.