అంపైర్లతో కోహ్లీ గొడవ
రెండో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసే సందర్భంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డ్ అంపైర్లతో గొడవకు దిగాడు. డీఆర్ఎస్ విషయంలో అసహనానికి గురైన కోహ్లీ.. అంపైర్లతో వాదనకి దిగాడు. దీంతో సర్దిచెప్పే ప్రయత్నం చేసిన అంపైర్లు.. ఆ తర్వాత కోహ్లీకి గట్టిగానే బదులిచ్చారు. అయితే ఈ గొడవకు అసలు కారణం మాత్రం కివీస్ ఓపెనర్ హెన్రీ నికోలస్. విషయంలోకి వెళితే...
రివ్యూ కోరిన నికోలస్:
టాస్ ఓడిన న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తోంది. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ బౌలింగ్లో హెన్రీ నికోలస్ వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. బంతి నేరుగా నికోలస్ ఫ్యాడ్ని తాకడంతో.. ఔట్ కోసం భారత్ ఫీల్డర్లు అప్పీల్ చేసారు. ఫీల్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సన్ఫర్ట్ ఔట్ అని వేలెత్తేసాడు. అంపైర్ నిర్ణయంపై సందేహం వ్యక్తం చేసిన నికోలస్.. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న మార్టిన్ గప్తిల్లో మాట్లాడి రివ్యూ కోరాడు.
కోహ్లీ అభ్యంతరం:
డిఆర్ఎస్ నిర్ణీత సమయం సున్నాకు వచ్చిన సమయంలో నికోలస్ రివ్యూ కోరాడు. దీంతో నికోలస్ రివ్యూని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంపైర్లు, కోహ్లీ మధ్య వాదన జరిగింది. అంపైర్లు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. టైం చూడండి అంటూ కోహ్లీ వారించాడు. ఇదే సమయంలో రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే ఓటేశాడు. దీంతో నికోలస్ 41 (59 బంతుల్లో 5x4) పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. మరోవైపు కోహ్లీ కూడా శాంతించాడు.
కోహ్లీ క్లీన్ బోల్డ్:
రెండో వన్డేలో విరాట్ కోహ్లీ (15) ఎక్కువ సేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. సౌతీ వేసిన 10 ఓవర్ నాలుగో బంతికి క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఫుల్ లెంగ్త్ బాల్ను ఆన్సైడ్లో ఫ్లిక్ చేద్దామని కోహ్లీ ప్రయత్నించగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను గిరటేయడంతో భారత కెప్టెన్ భారంగా నిష్క్రమించాడు. సాధారణంగా ఇటువంటి షాట్లు కొట్టడంలో ఎక్కువగా ఫెయిల్ కానీ కోహ్లీ.. ఈసారి అంచనా తప్పాడు.
టీమిండియా ఓటమి:
రెండో వన్డేలో టీమిండియా పోరాడి ఓడిపోయింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయి 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా (55), నవదీప్ సైనీ (45) గెలుపుపై ఆశలు రేపినా.. చివరి వరకూ ఆ జోరును కొనసాగించలేకపోయారు. దీంతో జడేజా, సైనీ పోరాటం వృధా అయింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ 2-0తో మరో మ్యాచ్ మిగులుండగానే కైవసం చేసుకుంది.