తొలిసారి భారత జట్టుకు నాయకత్వం:
2014లో అడిలైడ్ టెస్ట్ మ్యాచ్కు ముందు ఆసీస్ యువ క్రికెటర్ ఫిల్ హ్యూస్ దేశవాళీ క్రికెట్లో తలకు బౌన్సర్ తగిలి మరణించాడు. ఆ ఉదంతం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. క్రికెటర్లతో సహా ఎంతో మంది భావోద్వేగానికి గురయ్యారు. అంతకుముందు సిరీస్లో అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ గాయపడటంతో ఆ మ్యాచ్లో ఆడలేదు. దాంతో తొలిసారి విరాట్ విరాట్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. విరాట్ తాజాగా ఆ టెస్ట్ మ్యాచ్కు సంబంధించిన ఓ మధుర స్మృతిని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. చాలా ప్రత్యేకమైన, ముఖ్యమైన టెస్టు అని అభివర్ణించాడు.
ఇరు జట్లు అత్యంత భావోద్వేగంతో తలపడ్డాయి:
'ఒక టెస్టు జట్టుగా మా ప్రయాణంలో ఈ రోజు మేమున్న స్థితికి ఈ టెస్టు (2014లో అడిలైడ్ టెస్ట్) మ్యాచే కారణం. అందుకే అదెంతో ప్రత్యేకం, కీలకమైంది. అడిలైడ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో రెండు జట్లు అత్యంత భావోద్వేగంతో తలపడ్డాయి. ఆ పోరు అభిమానులకు అద్భుతంగా అనిపించింది' అని కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. అడిలైడ్ టెస్టు జరిగిన ఐదు రోజులు ఉత్కంఠ రేకెత్తించింది. కోహ్లీ తొలి ఇన్నింగ్స్లో 115, రెండో ఇన్నింగ్స్ 141 పరుగులు చేశాడు. భారత్ 364 పరుగుల లక్ష్య ఛేదనలో విజయం దిశగా సాగింది. అయితే అనూహ్య పరిణామాలతో 315కు ఆలౌటై పరాజయంపాలైంది.
|
ఆ మ్యాచ్ పాత్ర ఎంతో ఉంది:
'అడిలైడ్ టెస్ట్ మ్యాచ్లో మేం విజయం సాధించకపోయినా గెలిచినంత పనిచేసాం. మనం అనుకోవాలే గానీ ఏదైనా సాధ్యమేనని ఆ టెస్ట్ నేర్పించింది. కష్టమే అయినా అంకితభావంతో మొదలు పెట్టాలనుకున్నాం. విజయానికి దగ్గరగా వెళ్లాం. మేమందరం అప్పుడు అంకితమయ్యాం. ఒక టెస్టు జట్టుగా మా ప్రయాణంలో ఇదెప్పటికీ ప్రత్యేకం, కీలకం. ఈ రోజు భారత జట్టు ఈ స్థాయిలో ఉండడంలో ఆ మ్యాచ్ పాత్ర ఎంతో ఉంది' అని కోహ్లీ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్ ప్రేక్షకులకు కూడా గొప్ప అనుభూతినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు.