కోహ్లీ 100 మిలియన్:
సోమవారం నాటికి ఇన్స్టాలో విరాట్ కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య సరిగ్గా వంద మిలియన్లు చేరుకుంది. ఇంతకుముందు ప్రముఖ సినీ నటీనటులు ప్రియాంక చోప్రా, రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే 100 మిలియన్ల ఫాలోవర్లు గల సెలబ్రిటీలుగా పేరొందారు. వీరందరినీ దాటేసి కోహ్లీ సరికొత్త రికార్డు నమోదు చేశారు. ఈ నెల మార్చి ఒకటో తేదీ నాటికి ప్రియాంకకు 60 మిలియన్లకు పైగా, దీపికాకు 53.3 మిలియన్ల మంది ఫాలోవర్లు, ప్రధాని నరేంద్ర మోదీకి 51.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవలే దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, రణవీర్లను దాటేసి కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
తొలి క్రికెటర్గా:
సాకర్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో (266 మిలియన్), లియోనెల్ మెస్సీ (184 మిలియన్), నేమార్ (147 మిలియన్) తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రీడా సెలెబ్రిటీ విరాట్ కోహ్లీనే కావడం విశేషం. ఇంతమంది ఫాలోవర్లు ఉన్న తొలి క్రికెటర్ కోహ్లీనే. కోహ్లీకి ఇప్పటికే ఫేస్బుక్లో 36 మిలియన్లు, ట్విటర్లో 40.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. విరాట్ ఇన్స్టాగ్రామ్లో ఒక్క స్పాన్సర్డ్ పోస్ట్కు రూ. 1.29 కోట్లు తీసుకుంటాడని సమాచారం. 100 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి ఆసియా వ్యక్తిగా విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు.
70 సెంచరీలు:
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 90 టెస్టులాడి 52.7 సగటుతో 7490 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 251 వన్డేల్లో 59.3 సగటుతో 12912 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 60 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 85 టీ20లలో 50.5 సగటుతో 2928 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేశాడు.
సీరియస్గా ప్రాక్టీస్:
గురువారం నుంచి ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై దుమ్మురేపుతున్న భారత్ చివరి టెస్టు కోసం సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నది. మొతెరాలో జరిగిన తొలి అంతర్జాతీయ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో.. అదనంగా మరో మూడు రోజులు కలిసిరావడంతో భారత ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. సోమవారం కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.