
హైదరాబాద్: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఆరు వన్డే సిరీస్లలో భాగంగా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే సగం సిరీస్ను చేతబుచ్చకున్నాడు. ఈ పర్యటనలో అతని అసమాన ప్రతిభ చూసిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా కెప్టెన్లు కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పరుగుల యంత్రం, గీసుకున్న గీత దాటడు. విజయం కోసం కర్కోటకంగా పని చేస్తాడని కొనియాడుతున్నారు. ఇప్పుడు వీళ్లతో పాటుగా విండీస్ ఆటగాడు కూడా చేరాడు.
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివ్ రిచర్డ్స్లాగే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ప్రత్యర్థులపై ఏ మాత్రం దయ చూపించడని విండీస్ మాజీ ఆటగాడు కాళీచరణ్ అన్నారు. తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటాడని పేర్కొన్నారు. మూడేళ్లుగా విరాట్ అలుపెరగకుండా క్రికెట్ ఆడుతూ పరుగుల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో నాలుగు మ్యాచుల్లోనే రెండు శతకాలు బాదేశాడు.
'విరాట్ కోహ్లీ పట్టుదలగా కనిపిస్తాడు. నిర్ణయాత్మకంగా ఉంటాడు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. భారత్కు ఇంతకు ముందెన్నడూ ఇలాంటి సారథి ఉన్నట్టు కనిపించదు. కపిల్ దేవ్ను మాత్రం మినహాయించవచ్చు. అతడూ సొంతంగానే నిర్ణయాలు తీసుకునేవాడు. ప్రస్తుతం సారథ్యానికి విరాట్ కొత్త బ్రాండ్గా మారాడు. ఐదుగురు బ్యాట్స్మెన్, ఐదుగురు బౌలర్లతో ఆడతాననీ దానికే కట్టుబడి ఉంటానని చెప్పగల సమర్థుడు. అతడు సంప్రదాయ విరోధి' అని కాళీ చరణ్ అన్నారు.
'వారిద్దరిదీ (కోహ్లీ, రిచర్డ్స్) ఒకటే దృక్పథం. ప్రత్యర్థుల పట్ల చాలా కఠినంగా ఉంటారు. ఆటగాళ్లను పోల్చడం నాకిష్టం ఉండదు. కానీ కోహ్లీ వైఖరి అచ్చం రిచర్డ్స్లాగే జాలిలేకుండా ఉంటుంది' అని కాళీచరణ్ అన్నారు. 'కోహ్లీలో చాలా లక్షణాలు ఉన్నాయి. అతనో విజయవంతమైన సారథి. ఒక బ్యాట్స్మన్గా అయితే చెప్పతరం కాదు. ఎప్పుడూ పరుగుల దాహంతోనే ఉంటాడు. అతడి నిలకడ దుర్భేద్యం' అని పేర్కొన్నారు.
గతేడాది కోహ్లీ 26 వన్డేల్లో 1,460 పరుగులతో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక సగటు 76.84 కాగా స్ట్రైక్రేట్ 99.11. ఆరు శతకాలు, ఏడు అర్ధశతకాలు సాధించాడు. ఈ ఏడాదిలోనూ విరాట్ అదే జోరు కొనసాగిస్తున్నాడు. గంగూలీ, సచిన్, రికార్డులు బద్దలు కొడ్డుతూనే ఉన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.