
బెంగళూరు: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ వర్షం బారినపడింది. బెంగళూరులో ఎడతెరిపినివ్వకుండా కురిసిన వర్షం వల్ల రద్దయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 3.3 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసిన సమయంలో రెండోసారి మొదలైన వర్షం.. ఇక తెరిపినివ్వలేదు. పిచ్ను కవర్ చేసి ఉంచినప్పటికీ- అవుట్ ఫీల్డ్ మొత్తం బురదమయంగా మారింది. మ్యాచ్ కొనసాగించడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా పోయింది. దీనితో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
గ్రౌండ్ ఇలావుంటే- అటు స్టేడియం లోపల కూడా అదే పరిస్థితి కనిపించింది. స్టేడియంలో పలుచోట్ల వర్షపు నీరు పోటెత్తింది. గుమ్మరించినట్లు స్టేడియం రూఫ్ మొత్తం కారుతూ కనిపించింది. ప్రేక్షకులు తమ సీట్లల్లో కూర్చోవడానికి ఇబ్బంది పడ్డారు. వర్షం పడని చోటికి పరుగులు తీశారు. కొందరు ప్రేక్షకులు దీన్ని తమ సెల్ఫోన్ల ద్వారా చిత్రీకరించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్గా మారింది.
ఈ ఘటన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ వైఖరిపై విమర్శలకు దారి తీసింది. ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాల్లో హయ్యెస్ట్ రిచ్చెస్ట్ బోర్డ్ బీసీసీఐ. ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కళ్ల చూస్తుంటుంది. అలాంటి బీసీసీఐ హ్యాండోవర్లో ఉన్న స్టేడియాల్లో ఇలాంటి దుస్థితి చోటు చేసుకోవడం పట్ల పెద్ద ఎత్తున దుమారం రేగింది. మొన్నటికి మొన్నే ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందిన విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తోన్నారు.