హైదరాబాద్: సుదీర్థ పర్యటనలో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటిస్తోంది. ఇప్పటికే టెస్టు సిరీస్ ఆరంభమవడంతో తొలి టెస్టు మూడో రోజు ఆట మరి కొద్ది గంటల్లో ఆరంభం కానుంది. అయితే దీనికి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు భారత జట్టును కలిసేందుకు అనుమతి కావాలని వ్యాపారవేత్త విజయ్మాల్యా కోరాడట. దానికి ససేమిరా వీలు కాదంటూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం ప్రస్తుతం భారత్.. ఇంగ్లాండ్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. భారత్లో పలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి.. పలు కేసులు ఎదుర్కొంటున్న విజయ్మాల్యా ప్రస్తుతం లండన్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీతో పాటు భారత జట్టును కలిసేందుకు అవకాశం ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని మాల్యా కోరాడట. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లను కలిసేందుకు వీల్లేదని, వారిని కలిసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని తెలుపుతూ ప్రభుత్వం మాల్యాకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మాల్యా నిరుత్సాహానికి గురయ్యాడు.
గతేడాది ఇంగ్లాండ్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే సమయంలో టోర్నీ ప్రారంభానికి ముందు లండన్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి క్రికెటర్లు హాజరయ్యారు. అనంతరం అదే పార్టీకి మాల్యా కూడా వచ్చాడని తెలుసుకుని జట్టు మేనేజ్మెంట్ ఆటగాళ్లను వీలైనంత త్వరగా అక్కడ నుంచి తీసుకెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు మాల్యా స్టేడియానికి వచ్చాడు. అంతేకాదు, ఆ టోర్నీలో భారత్ ఆడిన పలు మ్యాచ్లను కూడా మాల్యా గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షించాడు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం ఎడ్జ్బాస్టన్లో తొలి టెస్టు జరుగుతోంది. భారత్ తన రెండో ఇన్నింగ్స్లో 110 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఇంకా 84 పరుగులు చేస్తే విజయం భారత్ సొంతం. ఇప్పటి వరకు ఎడ్జ్బాస్టన్లో భారత్ ఒక్క టెస్టు కూడా గెలవేలేదు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, దినేశ్ కార్తీక్ ఉన్నారు. తొలి టెస్టులో 13పరుగుల ఆధిక్యం దక్కించుకున్న ఇంగ్లాండ్ జట్టుకు భారత్ ఎలాంటి పోటీ ఇవ్వనుందో శనివారం మ్యాచ్లో తేలనుంది.