
ఓమన్: 6 బంతుల్లో 6 సిక్సర్లు అనగానే మనకు టక్కున గుర్తొచ్చే ప్లేయర్.. టీమిండియా మాజీ డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్. 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ సిక్సర్ల మోత మోగించాడు. ఓవర్లోని ఆరు బంతులను మైదానం బయటకు పంపించి ఔరా అనిపించాడు. ఆ తర్వాత ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లను చాలా మందే బాదారు. విండీస్ హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్, శ్రీలంక ఆటగాడు తిసార పెరీరా ఒకే ఓవర్లో ఆరు బంతులను మైదానం వెలుపలకు పంపారు. ఐపీఎల్ 14వ సీజన్లో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తృటిలో రికార్డును మిస్ అయినా.. తాజాగా భారత సంతతికి చెందిన ఓ క్రికెటర్ అందుకున్నాడు.
ఓమన్ వేదికగా పపువా న్యూగినియా, అమెరికా జట్లు అంతర్జాతీయ వన్డేలో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. అమెరికా ప్లేయర్స్ అందరూ విఫలమయినా.. భారత సంతతికి చెందిన జస్కరన్ మల్హోత్రా భారీ ఇన్నింగ్స్ ఆడాడు. పపువా న్యూగినియా ఏ బౌలర్ను వదలకుండా బాదాడు. 124 బంతుల్లో 173 రన్స్ చేశాడు. మల్హోత్రా తన ఇన్నింగ్స్లో కేవలం 4 బౌండరీలు మాత్రమే బాది.. ఏకంగా 16 సిక్సులు కొట్టాడు. బౌండరీల ద్వారానే 100కు పైగా పరుగులు చేశాడు. ఈక్రమంలోనే ఒకే ఓవర్లోని ఆరు సిక్సులు బాదాడు.
అమెరికా ఇన్నింగ్స్లోని ఆఖరి ఓవర్ను పపువా న్యూగినియా పేసర్ గౌడి టోకా వేశాడు. అదే ఓవర్లోని ఆరు బంతులను జస్కరన్ మల్హోత్రా ఆరు సిక్సర్లు బాది అందర్ని ఆశ్చర్యపరిచాడు. దీంతో ఆ మ్యాచ్లో 173 వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు మల్హోత్రా. దాంతో మల్హోత్రా అంతర్జాతీయ వన్డేలో రికార్డు నెలకొల్పాడు. మల్హోత్రా దెబ్బకు గౌడి టోకా 7 ఓవర్లలోనే 66 రన్స్ సమర్పించుకున్నాడు. అమెరికా క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతేకాకుండా అమెరికా క్రికెట్ జట్టుకు వన్డే హోదా వచ్చిన తర్వాత సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్మన్గా మల్హోత్రా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 2019లో యూఏఈ వేదికగా జరిగిన వన్డేలో అరోన్ జాన్స్(95) శతకం దగ్గరగా వచ్చి ఔట్ అయ్యాడు.