హైదరాబాద్: మైదానంలో క్రమశిక్షణారహితంగా ప్రవర్తించినందుకుగాను రబాడపై ఐసీసీ రెండు టెస్టుల నిషేదాన్ని జారీ చేసింది. ఈ విషయంపై రబాడ విచారాన్ని వ్యక్తం చేశాడు. అంతేగాక, పశ్చాతాపాన్ని కోరుతూ.. తన వల్ల జట్టు కూడా నష్టపోయిందని వాపోయాడు. ఇంకో సారి ఇలా జరగదంటూ నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో 11 వికెట్లతో ఈ ఫేసర్ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో రబాడ తన ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోలేకపోయాడు. ఫలితంగా తన జట్టును సైతం నష్టానికి గురి చేశాడు.
తొలి ఇన్నింగ్స్లో స్మిత్ భుజాన్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ యువ పేసర్.. రెండో ఇన్నింగ్స్లో వార్నర్ను బౌల్డ్ చేసి తీవ్రంగా అరిచాడు. ఈ ప్రవర్తనతో రబడ తర్వాతి రెండు టెస్టు మ్యాచ్లకు దూరమయ్యాడు.
రబడ మాట్లాడుతూ.. 'నేను ఇలా చేసుండాల్సింది కాదు. ఈ ప్రవర్తనతో మనిషిగా, వ్యక్తిగా ఎంతో దిగిజారిపోయా. ఈ ఘటనతో నేనెంతో నేర్చుకున్నా. ఇలాంటి తప్పిదాలను భవిష్యత్లో పునరావృతం కానివ్వను. స్మిత్ను ఉద్దేశ్యపూర్వకంగా తాకలేదు. లార్డ్స్ మైదానంలో నేను చేసింది తప్పని తెలిసే అప్పుడు అప్పీల్ చేయలేదు. నిజాయితీగా చేప్పాలంటే అసలు నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. ఓ పెద్ద సిరీస్ నుంచి దూరమయ్యాను. నేను చాలా ఆడాల్సింది. కీలక సమయంలో జట్టుకు దూరమయ్యానని' రబడ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతకుముందు వార్నర్ ఘటనలో కూడా 15 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాతో పాటు 1 డీమెరిట్ పాయింట్ను ఐసీసీ శిక్షగా విధించింది. దాంతో రబడ మొత్తం పాయింట్ల సంఖ్య 9కి చేరింది. నాలుగు టెస్టు మ్యాచ్ సిరీస్లో ఇరు జట్టు చెరోమ్యాచ్ గెలిచాయి. సరైన సమయంలో రబడా దూరం కావడం దక్షిణాఫ్రికా జట్టుకు నష్టం చేకూరనుంది.