
హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్లో ఫీల్డ్ అంపైర్ల తప్పిదాలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సీజన్ ఆరంభంలో పూర్తయిన రన్ను షార్ట్ రన్గా ప్రకటించి అంపైర్ నీతిన్ మీనన్ తీవ్ర విమర్శలు ఎదుర్కోగా.. మొన్న ధోనీకి భయపడి మరో అంపైర్ పాల్ రిఫేల్ వైడ్ ఇవ్వకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇక డీఆర్ఎస్లతో ఆటగాళ్లు గట్టెక్కింది సరేసరి. టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. అంపైర్లు చేస్తున్న తప్పిదాలు మ్యాచ్ ఫలితాలను శాసిస్తున్నాయి.
ఇక ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ థ్రిల్లింగ్ గేమ్లో కింగ్స్ పంజాబ్ అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో సాగిన ఈ మ్యాచ్ ఒక్కో అభిమాని గుండె తట్టి లేపింది. అలాంటి మ్యాచ్లో అంపైర్ నితిన్ మీనన్ తప్పు చేసాడనే ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
పంజాబ్ విజయానికి చివరి 6 బంతుల్లో 9 పరుగులు అవసరమైన దశలో తొలి బంతికి దీపక్ హుడా సింగిల్ తీయగా.. ఆ తర్వాత బంతికి ఫోర్ కొట్టిన జోర్డాన్.. మూడో బంతికి సింగిల్ తీసిచ్చాడు. ఇక నాలుగో బంతిని బౌల్ట్ కళ్లు చెదిరే రీతిలో లెగ్ స్టంప్కి వెలుపలగా యార్కర్ సంధించాడు. దాంతో.. దీపక్ హుడా తెలివిగా ముందుకు జరగగా.. బంతి లెగ్ స్టంప్కి ఎడంగా వెళ్లింది. కానీ.. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం ఆ బంతిని వైడ్గా ఇవ్వలేదు. అంపైర్ తీరుపై దీపక్ హుడా మైదానంలో అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా జోర్డాన్ రనౌటవ్వడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు దారి తీసింది. అది కూడా టై అవడంతో మరో సూపర్ ఓవర్లో పంజాబ్ గెలిచింది.
అయితే అంపైర్ నితీన్ మీనన్ ఆ బంతి వైడ్ ఇచ్చుంటే పంజాబ్ అప్పుడే గెలిచేదని ఆ జట్టు అభిమానులు వాదిస్తున్నారు. ఈ థ్రిల్లింగ్ సూపర్ ఓవర్కు కారణం నితీన్ మీననే,అని అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలని కోరుతున్నారు. వాస్తవానికి అది సరైన నిర్ణయమేనని ఆ సమయంలో కామెంటేటర్లు తేల్చారు. హుడా ముందుకు జరగడంతో అంపైర్ వైడ్ ఇవ్వలేదని, కొద్దీలో స్టంప్స్ మిస్సైందని లేకుంటే బౌల్ట్ అయ్యేవాడని పేర్కొన్నారు. అభిమానులు మాత్రం ఇదేం పట్టించుకోకుండా అతని నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లోనూ పంజాబ్ బ్యాట్స్మెన్ క్రీజు లోపల బ్యాట్ ఉంచినా.. నితిన్ మీనన్ షార్ట్ రన్గా ప్రకటించాడు. దాంతో.. ఆ మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్లగా.. పంజాబ్ ఓడిపోయింది. అంపైర్ల తప్పిదాలను తగ్గించాలంటే, వైడ్, హైట్ నోబాల్స్కు కూడా రివ్వ్యూ ఇవ్వాలని ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.