నిర్దేశ్ స్పిన్ మాయాజాలం:
మొత్తం 21 ఓవర్లు వేసిన నిర్దేశ్ బైసోలా 51 పరుగులిచ్చి 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 10 ఓవర్లను మెయిడెన్లు ఉన్నాయి.నిర్దేశ్ స్పిన్ మాయాజాలంకు నాగాలాండ్ జట్టు తొలిరోజు 113 పరుగులకే ఆలౌటైంది. నిర్దేశ్ సొంతూరు మీరట్. కానీ.. అతడు మేఘాలయ తరఫున ఆడుతున్నాడు. రెండేళ్లుగా నిర్దేశ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. గత టోర్నీలో ఆరు మ్యాచ్లాడిన ఈ ఆఫ్ స్పిన్నర్ 33 వికెట్లు తీశాడు. తాజా టోర్నీలో నాలుగు మ్యాచ్లాడిన అతను 27 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
20 ఏళ్ల క్రితమే పదికి పది:
అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్ల క్రితమే దిగ్గజం అనిల్ కుంబ్లే (10/74) 10 వికెట్లు తీసాడు. ఢిల్లీ టెస్టులో పాకిస్తాన్పై ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లతో చరిత్రకెక్కాడు. కుంబ్లే ప్రదర్శనతో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. గతేడాది కూచ్ బెహర్ ట్రోఫీలో మణిపూర్ పేసర్ రెక్స్ సింగ్ కూడా 10 వికెట్లు తీసాడు. పుదుచ్చేరి లెఫ్టార్మ్ స్పిన్నర్ సిదాక్ సింగ్ సీకే నాయుడు ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టేశాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు కుంబ్లే తప్ప ఈ రికార్డును మరెవరూ సాధించని విషయం తెలిసిందే.
ఇది ఆరంభమే..ఇంకా ఉంది:
మ్యాచ్ అనంతరం నిర్దేశ్ బైసోలా మాట్లాడుతూ... 'ఇది నా కెరీర్ ఆరంభం మాత్రమే. ఇంకా చాలా ఉంది. అనిల్ కుంబ్లే సర్ 10 వికెట్లు తీసినప్పుడు నేను పుట్టలేదు. కానీ.. నేను దాని గురించి చాలా విన్నాను. నేను కూడా 10 వికెట్లు తీయాలని అనుకున్నా. అయితే ఇంత త్వరగానే తీస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను నా తల్లిదండ్రులతో మాట్లాడా. వారు కూడా ఉద్వేగానికి లోనయ్యారు' అని తెలిపాడు.
నా కల నెరవేరింది:
'మొదటి సెషన్ వరకు ఆరు వికెట్లు తీయాలనుకున్నా. ఆ తర్వాత 10వికెట్లపై దృష్టి పెట్టొచ్చని అనుకున్నా. నా సహచరులు చాలా మద్దతు ఇచ్చారు. ఉదయం నుండి పిచ్ టర్న్ అవ్వడం కూడా నాకు కలిసొచ్చింది. నా కల నెరవేరుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నాకు కేవలం 15 ఏళ్లు. కెరీర్ పరంగా చాలా దూరం వెళ్ళవలసి ఉన్నందున ఇంకా కష్టపడాలి. నా సోదరీమణులు, సోదరులు, తల్లిదండ్రులు గర్వంగా ఉన్నారు' అని నిర్దేశ్ పేర్కొన్నాడు.