
హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెటర్ ఫకార్ జమాన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్ తరుపున తొలి డబుల్ సెంచరీ సాధించాడు. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న నాలుగో వన్డేలో ఫకార్ జమాన్ ఈ ఘనత సాధించాడు.
తద్వారా వన్డే క్రికెట్లో పాక్ తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు పాక్ తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా సయ్యద్ అన్వర్ (194) పరుగులు పేరిట ఉన్న రికార్డుని ఫకార్ జమాన్ అధిగమించాడు.
గతంలో భారత్పై సయ్యద్ అన్వర్ చేసిన 194 పరుగులే ఇప్పటివరకు అత్యధికం. మొత్తంగా డబుల్ సెంచరీ సాధించిన ఆరో ఆటగాడిగా జమాన్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఫకార్ జమాన్ (156 బంతుల్లో 210 నాటౌట్; 24 ఫోర్లు, 5 సిక్సులు) విధ్వంసకర ఇన్నింగ్స్తో నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ నష్టానికి 399 పరుగులు చేసింది.
మ్యాచ్ ఆరంభం నుంచి పాక్ ఓపెనర్లు టీ20 తరహాలో విజృంభించారు. బౌండరీలు, సిక్సులతో స్కోరు బోర్డుని పరిగెత్తించారు. జింబాబ్వే బౌలర్లను ఫకార్ జమాన్ ఓ ఆటాడుకున్నాడు. కళాత్మక షాట్లతో అభిమానులను అలరించాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన పాక్ను కట్టడి చేసేందుకు ఆతిథ్య బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.
పసలేని బౌలింగ్ కారణంగా అద్భుతమైన ఫామ్లో ఉన్న పాక్ బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. ఓపెనర్ ఇమామ్ హుల్ హక్(113) పరుగుల వద్ద ఔట్ కావడంతో తొలి వికెట్కు 304 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 42వ ఓవర్లో సీనియర్ బౌలర్ మసకద్జకు ఆ వికెట్ దక్కింది.
ఆ తరువాత క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీ కూడా దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 22 బంతుల్లోనే 50 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. జింబాబ్వేకు 400 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సోషల్ మీడియా వేదికగా ఫకార్ జమాన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్లు:
1. రోహిత్ శర్మ(264)
2. మార్టిన్ గప్తిల్(237)
3. వీరేంద్ర సెహ్వాగ్(219)
4. క్రిస్ గేల్(215)
5. ఫకార్ జమాన్(210)
6. రోహిత్ శర్మ(209)
7. రోహిత్ శర్మ(208)
8. సచిన్ టెండూల్కర్(200)