ఆక్లాండ్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో టీమిండియాకు న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ హెచ్చరికలు జారీ చేసాడు. వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయడానికి ప్రయత్నిస్తాం అని కివీస్ కెప్టెన్ అన్నాడు. టీమిండియాతో శనివారం జరిగిన రెండో వన్డేలో కివీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో కివీస్ ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకుంది. మూడో వన్డే మంగళవారం జరగనుంది.
రాహుల్ ద్రవిడ్ బౌలింగ్.. సీఎం పళని స్వామి బ్యాటింగ్!!
టామ్ లాతమ్ మాట్లాడుతూ... 'తొలి వన్డేలో బ్యాట్స్మెన్ గెలిపిస్తే, రెండో మ్యాచ్లో బౌలర్లు విజయాన్ని అందించారు. మా ఆటగాళ్లు అందరూ బాగా ఆడారు. హామిల్టన్, ఆక్లాండ్ వికెట్లు బాగున్నాయి. ఆదిలో వికెట్లు తీస్తే మ్యాచ్ మన చేతుల్లోకి వస్తుంది. రోస్ టేలర్-జిమ్మీ జేమీసన్ గొప్పగా ఆడారు. ఆక్లాండ్ వన్డేలో భారత్ చివరి వికెట్ తీసే వరకు సంతృప్తి పడలేదు. వికెట్లు కోల్పోతున్నా భాగస్వామ్యాలు నెలకొల్పడానికి భారత ఆటగాళ్లు ప్రయత్నించారు' అని అన్నాడు.
రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, నవదీప్ సైనీ బాగా పోరాడారు. మంచి బాగస్వామ్యాలతో రేసులోకి వచ్చారు. అయితే అరంగేట్రం మ్యాచ్లోనే కైల్ జెమీసన్ అదరగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో బౌలర్లు అందరూ పుంజుకున్నారు. చివరి మ్యాచ్లోనూ గెలిచి వన్డే సిరీస్ను 3-0తో ముగించడానికి ప్రయత్నిస్తాం' అని లాథమ్ చెప్పుకొచ్చాడు. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కాగా.. లాథమ్ సారధ్య బాధ్యతలు చేపట్టాడు.
ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 273/8 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (79), రాస్ టేలర్ (73 నాటౌట్) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం బరిలోకి దిగిన భారత్ 251 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా (55), నవదీప్ సైనీ (45) రాణించారు. సైనీ 5 ఫోర్లు, 2 సిక్స్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. జడేజా, సైనీ విజయం కోసం తుదివరకు పోరాడినా.. ఫలితం దక్కలేదు.