హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్తో ఇటీవలే ముగిసిన డే నైట్ టెస్టులో అతిగా స్వింగ్ అవుతున్న పింక్ బాల్ను ఏ మాత్రం తడబడకుండా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అందుకున్న సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకుని బంగ్లాదేశ్ పర్యటనలో తుది జట్టులో చోటు దక్కించుకున్న సాహా తన అద్భుతమైన వికెట్ కీపింగ్తో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
ఈ విషయమై తాజాగా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఇతరులకంటే భిన్నంగా ఏమీ చేయట్లేదు. బౌలర్ బంతిని సంధించే వరకు సాధారణ స్థితిలోనే ఉంటాను. తర్వాత బంతి గమనాన్ని బట్టి నా కదలిక ఉంటుంది. కానీ, గులాబి బంతి బ్యాట్స్మన్ను దాటిన తర్వాత అది మరింత స్వింగ్ అవుతుంది. పింక్ బాల్ నాకు పరీక్షగా నిలిచింది" అని సాహా చెప్పుకొచ్చాడు.
ఉప్పల్లో తొలి టీ20: నేటి నుంచి టికెట్ల అమ్మకాలు.. కనీస ధర రూ. 800!!
"స్టేడియంలో 70వేల అభిమానుల ముందు నేను పొరపాటు చేయనని నా సహచరులకు చెప్పాను. నేను విఫలం కావడానికి మార్గం లేదు. చివరి సెకను వరకు వేచి చూసి బంతిని అందుకుంటాను. ప్రస్తుతం తగిలిన వేలి గాయం సాధారణ చీలికే. కోలుకోవడానికి ఐదు వారాల కన్నా ఎక్కువ సమయం పట్టదు" అని సాహా పేర్కొన్నాడు.
కాగా, బంగ్లాతో జరిగిన డే నైట్ టెస్టులో సాహా కుడిచేతి ఉంగరపు వేలికి గాయమైంది. ముంబైలో అతడి వేలికి బుధవారం ఆపరేషన్ జరిగింది. సాహాకు ఆపరేషన్ సక్సెస్ అయినట్లు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. ఆపరేషన అనంతరం ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో సాహాకు పునరావాస ప్రక్రియ ప్రారంభమైంది.