ధోనీ లాంటి కెప్టెన్ను భర్తీ చేయగలమా..?
కెప్టెన్గా మహేంద్రసింగ్ ధోనీ నుంచి విరాట్ కోహ్లీ వరకు ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్లను చూసే భాగ్యం తనకు తన టీమ్కు దక్కిందన్నారు ఎమ్మెస్కే ప్రసాద్. ఎప్పుడైతే ధోనీ కెప్టెన్గా బాధ్యతల నుంచి తప్పుకున్నారో మళ్లీ అలాంటి సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి కోసం చూశామని చెప్పిన ఎమ్మెస్కే... విరాట్ కోహ్లీ ఆ స్థానంను భర్తీ చేయగలిగాడని వెల్లడించారు. విరాట్ కోహ్లీ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాక టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుందని గుర్తు చేశారు ఎమ్మెస్కే ప్రసాద్. అది కూడా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో భారత్ నిలిచిందని చెప్పారు. అదే తనకు సంతృప్తినిచ్చే విషయం అని స్పష్టం చేశారు.
నెంబర్ 4 బ్యాట్స్మెన్ లేకపోతే టాప్లో ఎలా నిలిచాం..?
2019 వరల్డ్ కప్లో టీమిండియా అప్పటి ధోనీ నాయకత్వంలో సెమీస్లో ఓటమి పాలైంది. ఆ సందర్భంగా ధోనీ భవిష్యత్తుపై ప్రసాద్ సెలెక్షన్ కమిటీ వ్యవహరించిన తీరు పలు విమర్శలకు తావిచ్చింది. అయితే ధోనీ తన భవిష్యత్తుపై స్పష్టత వ్యక్తం చేయడంతోనే మరొకరిని ఎంపిక చేయాల్సి వచ్చిందన్నారు. ఇక ధోనీ ఆసమయంలో తనతో టీమ్ మేనేజ్మెంట్తో ఏం చెప్పాడో తెలుసునని అయితే వాటి గురించి తాను మాట్లాడబోనని ఎమ్మెస్కే చెప్పారు. అది తమ మధ్య చాలా రహస్యంగా ఉండాల్సిన విషయమన్నారు. భారత్లో నాల్గవ బ్యాట్స్మెన్ లేనందునే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందన్న విమర్శలపై తాను ఏకీభవించనని చెప్పారు ఎమ్మెస్కే. గ్రూప్లో టాపర్గా భారత్ నిలిచిందంటే అది జట్టు సమిష్టి కృషి వల్లే అని చెప్పిన ఎమ్మెస్కే.. నాల్గవ బ్యాట్స్మెన్ లేక కాదని స్పష్టం చేశారు.
హార్థిక్ పాండ్య బుమ్రాలను టెస్టు మ్యాచ్లకు పరిచయం చేశాం
ఇక హార్ధిక్ పాండ్య జస్ప్రీత్ సింగ్ బుమ్రాలను టెస్టు మ్యాచులకు పరిచయం చేసిన ఘనత తమదే అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పారు. అసలు ఎవరూ ఊహించలేని విధంగా రిషబ్ పంత్ను తీసుకొచ్చామని... ఇండియా ఏ జట్టులో అతనికి మెలుకువలు నేర్పామని వెల్లడించారు. తను ఐదేళ్లలో చీఫ్ సెలెక్టర్గా పనిచేసిన కాలంలో ఈ రెండు నిర్ణయాలు అత్యంత సాహసోపేతమైనవిగా అభివర్ణించారు. అంతేకాదు వన్డేల నుంచి రవీంద్ర జడేజా, అశ్విన్ రవిచంద్రన్లను పక్కకు పెట్టడం, ఎమ్ఎస్ ధోనీ స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం కూడా సవాళ్లతో కూడిన పనే అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పారు.