
హైదరాబాద్: ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఓ పవర్ హౌస్ అని న్యూజిలాండ్ మాజీ అల్ రౌండర్ క్రెయిగ్ మెక్మిలన్ వ్యాఖ్యానించాడు. 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం టీమిండియా సోమవారం కివీస్ పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ సిరిస్లో ఆతిథ్య జట్టు పాస్ మార్కులు పొందేందుకు అర్హత సాధించాలంటే మూడు ఫార్మాట్లలో రెండింటిలో గెలవాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ఆస్ట్రేలియాపై 2-1తో వన్డే సిరీస్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటన బయల్దేరింది.
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనుంది. ఈ సందర్భంగా క్రెయిగ్ మెక్మిలన్ మాట్లాడుతూ "ఇది సుదీర్ఘ సిరిస్. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన అనంతరం భారత పర్యటిస్తోన్న అతి పెద్ద సిరిస్ ఇది" అని అన్నాడు.
"టీమిండియా ఒక పవర్ హౌస్. టెస్టులు, వన్డేలు, టీ20లతో సంబంధం లేదు. ఈ పర్యటన ఆసక్తికరంగా సాగుబోతోంది. ఈ సిరిస్లో న్యూజిలాండ్ పాస్ మార్క్ పొందాలంటే ఆ జట్టు మూడు సిరీస్లలో కనీసం రెండింటలోనైనా విజయం సాధించాలి" అని మెక్మిలన్ తెలిపాడు.
"ఐదు టీ20ల సిరిస్తో ప్రారంభించడం... అందరికీ ఇష్టమైన ఫార్మాట్ కాదని నాకు తెలుసు. ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. కాబట్టి ఈ ఐదు మ్యాచ్లు ఎంతో ముఖ్యమైనవి. ఆస్ట్రేలియాలో మంచి ప్రదర్శన చేయాలంటే మనం మళ్ళీ గెలుపుతో ప్రారంభించి మద్దతును తిరిగి పొందాలి" అని చెప్పుకొచ్చాడు.
"ఇప్పటికీ టీ20ల్లో మా ఉత్తమ జట్టుని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఇప్పుడే సూపర్ స్మాష్ చూశాము. అలాంటి ప్రదర్శన చేసిన కొంతమంది యువకులకు అవకాశం ఇవ్వడానికి ఈ సిరిస్ ఓ మంచి అవకాశం" అని క్రెయిగ్ మెక్మిలన్ తెలిపాడు. న్యూజిలాండ్ పర్యటన టీమిండియాకు అంత ఈజీ కాదు.
అందుకు కారణం కివీస్ గడ్డపై స్వింగ్, సీమ్కు అనుకూలించే పిచ్లు ఉంటాయి. మరోవైపు వణికించే చలి... న్యూజిలాండ్ వాతావరణం భిన్నంగా ఉంటుంది. 2009, 2019 సిరీస్లను పక్కన పెడితే న్యూజిలాండ్లో అడుగుపెట్టి టీమిండియా వన్డే సిరీస్ గెలిచిన దాఖలాలు లేవు. కివీస్ గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఐదు టీ20లు ఆడగా కేవలం ఒక్కదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఈ గణాంకాలు చాలు కివీస్ పర్యటన ఎంత కష్టమో.