హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన క్రికెట్ లీగ్ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లీగ్ ఒకటి. ఐపీఎల్ను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికే అనేక దేశాలు లీగ్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా(బిగ్ బాష్ లీగ్), పాకిస్థాన్(పాకిస్థాన్ సూపర్ లీగ్), వెస్టిండీస్(కరీబియన్ ప్రీమియర్ లీగ్), బంగ్లాదేశ్(బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్) ఈకోవలోకి చెందినవే.
గత కొన్నేళ్లుగా లీగ్లను నిర్వహిస్తున్నప్పటికీ ఆశించిన మేర సక్సెస్ కాలేకపోయాయి. అయితే తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో త్వరలో ఓ టీ20 లీగ్ను నిర్వహించేందుకు శ్రీలంక సన్నాహాలు చేస్తోంది. ఈ లీగ్కు లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) అని పేరు కూడా పెట్టింది.
ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ తిలంగ సుమతిపాల మీడియాతో మాట్లాడుతూ బీసీసీఐతో వార్షిక కాంట్రాక్టు కుదుర్చుకోని ఆటగాళ్లను తాము నిర్వహించే లీగ్కు అనుమతివ్వాలని ఆయన బీసీసీఐని కోరారు. అంతేకాదు భారత క్రికెటర్లు లీగ్లో పాల్గొంటే ఆదరణతో పాటు ప్రేక్షకులు కూడా స్టేడియాలకు వస్తారని ఆయన అన్నారు.
'కాంట్రాక్టు జాబితాలో ఉన్న ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్ల లంక ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు వారికి అనుమతివ్వాలి. వందల సంఖ్యలో భారత్లో ప్రతిభ కలిగిన ఆటగాళ్లున్నారు. ఐపీఎల్ ఆడిన తరువాత వీరందరికి సమయం ఉంటుంది. మేము 20మిలియన్ల మందే ఉన్నాం' అని ఆయన అన్నారు.
అయినా సరే మిగతా దేశాలు నిర్వహించే టోర్నీలు మా క్రికెటర్లను పంపిస్తున్నామని, ఈ నేపథ్యంలో భారత్ టాప్ 30 ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లను లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) లీగ్లో ఆడేందుకు అనుమతివ్వాలని బీసీసీఐని సుమతిపాల కోరారు. అయితే ఆయన విజ్ఞప్తిని బీసీసీఐ ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి మరి.